అదానీ వ్యవహారాలపై ప్రధాని స్పందించాలి: గిడుగు
ABN , First Publish Date - 2023-02-07T03:45:41+05:30 IST
అదానీ గ్రూపు వ్యవహారాలపై ప్రధానమంత్రి తక్షణమే స్పందించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు.

అనకాపల్లిలో పాదయాత్ర, ఎస్బీఐ, ఎల్ఐసీల ఎదుట నిరసన
అనకాపల్లి టౌన్, వేంపల్లె, ఫిబ్రవరి 6: అదానీ గ్రూపు వ్యవహారాలపై ప్రధానమంత్రి తక్షణమే స్పందించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. ఆయన సోమవారం అనకాపల్లిలో ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఎస్బీఐ, ఎల్ఐసీల ముందు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన జంక్షన్ల మీదుగా పాదయాత్ర చేస్తూ శారదానది సమీపాన వున్న జీవిత బీమా సంస్థ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం విలేకరులతో రుద్రరాజు మాట్లాడుతూ అదానీ గ్రూపు వ్యవహారాలపై జాయింట్ పార్లమెంటు కమిటీ ఏర్పాటుచేసి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో కొప్పుల రాజు, పి.రాకేశ్రెడ్డి, మీసాల సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. కాగా, అదానీ కంపెనీల అవకతవకలపై జేపీసీతో గాని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో గాని విచారణ జరిపించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన చేశారు. పార్లమెంటులో మోదీ ప్రభుత్వం పారిపోవడం శోచనీయమన్నారు.