తెరిచారు సరే.. పిల్లలేరీ?
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:07 AM
ఇంటి దగ్గరున్న చిన్నారులను కేంద్రానికి తీసుకువెళ్లి.. వారి బాగోగులు చూసి.. సమయానికి భోజనం పెట్టి.. చదువు చెప్పి.. ఆటలు నేర్పి.. అంతే క్షేమంగా ఇంటికి అప్పగించే అంగన్వాడీలు సమ్మెలో ఉన్నారు. ఇవేవీ తెలియని సచివాలయ సిబ్బంది కేంద్రాల్లో ఉన్నారు. సమ్మెలో ఉన్నా పిల్లలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని ప్రభుత్వం చెప్పుకుంటోంది
తెరిచారు సరే.. పిల్లలేరీ?
అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులను పంపించేదిలేదని తల్లిదండ్రులు
అన్నిచోట్లా బోసిపోతున్న వైనం
చదువు లేదు.. భోజనాలు లేవు
ఖాళీగా కూర్చుంటున్న సచివాలయ సిబ్బంది
ఇంటి దగ్గరున్న చిన్నారులను కేంద్రానికి తీసుకువెళ్లి.. వారి బాగోగులు చూసి.. సమయానికి భోజనం పెట్టి.. చదువు చెప్పి.. ఆటలు నేర్పి.. అంతే క్షేమంగా ఇంటికి అప్పగించే అంగన్వాడీలు సమ్మెలో ఉన్నారు. ఇవేవీ తెలియని సచివాలయ సిబ్బంది కేంద్రాల్లో ఉన్నారు. సమ్మెలో ఉన్నా పిల్లలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని ప్రభుత్వం చెప్పుకుంటోంది.. క్షేత్రస్థాయిలో చూస్తే పిల్లలను పంపేదిలేదని.. అంగన్వాడీలు ఉంటేనే తమ పిల్లలకు భద్రమని తల్లిదండ్రులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కేంద్రాలనైతే తాళాలు బద్దలు కొట్టి తెరిపించారు. సచివాలయ సిబ్బంది రికార్డులు పరిశీలించి పిల్లలు రాకపోవడంతో కూర్చొని వెళ్లిపోతున్నారు.
(విజయనగరం- ఆంధ్రజ్యోతి)/ కలెక్టరేట్/ శృంగవరపుకోట రూరల్
- రామభద్రపురం మండల కేంద్రంలో అంగన్వాడీలు నిర్వహిస్తున్న దీక్ష శిబిరమది. వారి సమ్మెకు మద్దతుగా శనివారం పిల్లలు, వారి తల్లులు వచ్చి కూర్చొన్నారు. అంగన్వాడీలు లేకుండా తమ పిల్లలను కేంద్రాలకు పంపేది లేదని వారంతా స్పష్టంచేశారు.
- శృంగవరపుకోట మండలం శివరామరాజుపేట అంగన్వాడీ కేంద్రానికి శనివారం తొమ్మిది మంది వరకు పిల్లలు వచ్చారు. వారిని వెల్ఫేర్ అసిస్టెంట్ కొద్దిసేపు ఆడిపించి ఇంటికి పంపించేశారు. ఇది గుర్తించిన పిల్లల తల్లిదండ్రులు ఆకలితో పంపించడానికా తీసుకెళ్లారు అని ప్రశ్నించారు.
అంగన్వాడీ కేంద్రాల తాళాలను ప్రభుత్వం పగులగొట్టి తెరిపించింది. అందుకోసం చాలా హడావిడి చేసింది. కేంద్రాలను తెరిపించేందుకు తొలుత వెళ్లిన సచివాలయ సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. అంగన్వాడీ వర్కర్లు ఉంటేనే పిల్లలకు అన్ని విధాలా మేలని చెప్పారు. పిల్లలను భద్రంగా తీసుకువెళ్లి.. తీసుకురాగలరా అని ప్రశ్నించారు. చాలాచోట్ల ఇవే పరిస్థితులు ఎదుర వడంతో ప్రభుత్వం బలవంతంగా తెరిపించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్లు ఏర్పాటుచేసి సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. వారు పోలీసులను తోడ్కొని వెళ్లి తాళాలు బద్దలుకొట్టారు. ఇంత వ్యవహారం జరిగాక సాధించింది ఏమిటీ అంటే కేంద్రాలు తెరుచుకున్నాయంతే.. పిల్లలు మాత్రం రావడం లేదు. సచివాలయంలో విధులు నిర్వహించే సిబ్బంది మూడు రోజులుగా అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్నారు. కూర్చొని వెళ్లిపోతున్నారు. ఇదిలా ఉండగా తాళాలు అప్పగించండని ఒక ఆదేశం ఇస్తే ఇచ్చేసేవారమని, దౌర్జన్యంగా తాళాలను పగులగొట్టాల్సిన అవసరం ఏముందని అంగన్వాడీలతో పాటు సాధారణ పౌరులు అభిప్రాయపడుతున్నారు. చాలా కేంద్రాలు తెరిచినా తల్లిదండ్రులు వారి పిల్లలను పంపించడం లేదు. కేంద్రాలు తెరిచినట్లు ఆన్లైన్లో చూపించేందుకు తప్ప కార్యకలాపాలు సాగడం లేదు. వంట వార్పు జరగటం లేదు. మరోవైపు శనివారం కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన కొనసాగించారు. జిల్లాలో 50శాతం మేర కేంద్రాలు శనివారం తెరిచారు.
కేంద్రాలన్నీ తెరవాలి: కలెక్టర్
అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు సమ్మెలో ఉన్న నేపథ్యంలో బాలింతలు, గర్భిణులు,పిల్లలకు ఇబ్బంది లేకుండా చూడాలని, ఆహారం అందించాలని, అన్ని అంగన్వాడీ కేంద్రాలను తెరిచి నడపాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. సీడీపీవోలు, ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులతో శనివారం ఆమె వెబ్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఇప్పటికి 80 శాతం వరకూ కేంద్రాలను సచివాలయ సిబ్బంది హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని, సోమవారం నుంచి పూర్తిస్థాయిలో నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్వాక్రా మహిళలు, తల్లుల సహకారం తీసుకుని సమీప పాఠశాలలలో భోజనం వండి వడ్డించాలని ఆదేశించారు.
కొనసాగుతున్న నిరసన
కలెక్టరేట్: అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. నాలుగు రోజులుగా కలెక్టరేట్ వద్ద శిబిరం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. వారి ఆందోళనకు ప్రజాసంఘాలు, పార్టీల ప్రతినిధులు వచ్చి మద్దతు తెలియజేస్తున్నారు. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి, కార్యదర్శి అనురాధ బేగం శనివారం శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బంకురు జోగినాయుడు మద్దతు తెలిపారు.