బెంచికి ఒక్కరే...
ABN , First Publish Date - 2023-04-03T00:47:24+05:30 IST
జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాలూరు రూరల్, ఏప్రిల్ 2: జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ మేరకు ఆదివారం పరీక్ష కేంద్రాల్లో సీటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసి రోల్ నెంబర్లు రాశారు. గతంలో బెంచికి ఇద్దరు విద్యార్థులు కూర్చొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి బెంచికి ఒక్క విద్యార్థే ఉండేటట్టు సీటింగ్ అరెంజ్మెంట్ ఇచ్చారు. గది మరీ ఇరుకుగా ఉండి 24 మందికి సర్దుబాటు లేకపోతేనే బెంచికి ఇరువురు కూర్చొనే అవకాశం కల్పించారు. జిల్లాలో 64 కేంద్రాల్లో టెన్త్ పరీక్షలను నిర్వహిస్తుండగా, వాటిల్లో 22 సీ సెంటర్లు ఉన్నాయి. మొత్తంగా 11,336 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను ఉదయం 8.45 గంటల నుంచి పరీక్ష హాల్లోకి అనుమతించనున్నారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరు. ఇదిలా ఉండగా పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్లు బాధ్యయుతంగా విధులు నిర్వర్తించాలని ఆపస్ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు నాలి చంద్రశేఖర్, ఏపీటీఎఫ్ ( 257 ) పాచిపెంట నేత పీఎస్ఎస్ఎస్ మోహనరావు సూచించారు.
కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు
పదో తరగతి పరీక్షలు జరిగే తేదీల్లో జిల్లాలోని 64 కేంద్రాలకు ఉదయం 8.30 గంటలకు బస్సు చేరుకునే విధంగా కార్యాచరణ చేసినట్టు ఆర్టీసీ డీపీటీవో సుధాకర్ ఆదివారం చెప్పారు. జిల్లాలో అన్ని కేంద్రాలకు బస్సులు వెళ్లేటట్టు చర్యలు తీసుకున్నామన్నారు. అటు వెళ్లే రూట్ బస్సుల వేళల్లో మార్పు చేశామన్నారు. పాచిపెంట మండలం బడ్నాయకవలస, సాలూరు మండలం కొత్తవలసకు ప్రత్యేకంగా బస్సును నడపనున్నామన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్టిక్కెట్టు చూపించాల్సి ఉందన్నారు. హాల్టిక్కెట్ చూపించకుంటే ఉచిత ప్రయాణం ఉండదని స్పష్టం చేశారు.