చెల్లింపుల్లేవ్!
ABN , First Publish Date - 2023-02-07T00:04:23+05:30 IST
ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధుల వినియోగంలో మండలం వెనుకబడింది.

సాగని ఉపాధి హామీ అభివృద్ధి పనులు
తగ్గిన మెటీరియల్ కాంపోనెంట్ నిధుల కేటాయింపులు
వెనుకబడిన సీతంపేట
(సీతంపేట)
ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధుల వినియోగంలో మండలం వెనుకబడింది. అభివృద్ధి పనులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు కాకపోవడంతో ఏటా మండలానికి కేటాయింపులు తగ్గుతున్నాయి. వాస్తవంగా వేతనదారులకు 60 శాతం పనులు కల్పిస్తేనే 40 శాతం మెటీరియల్ కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులను వినియోగించాల్సి ఉంది. అయితే కరోనా సమయంలో భారీగా ఖర్చు చూపించగా ప్రస్తుతం మండలంలో ఆ పరిస్థితి లేదు. 2020-21లో పెద్దఎత్తున పనులు జరిగాయని రూ.19 కోట్లు వినియోగించగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.7 కోట్లకే పరిమితమయ్యారు. అయితే ఈసారి మెటీరియల్ కింద నిధులు సమకూరుతాయా లేదా అనే దానిపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి హామీలో భాగంగా భవనాల నిర్మాణం, రహదారులు, డ్రైనేజీలు, సచివాలయ వెల్నెస్ కేంద్రాలు, డెయిరీలు పాఠశాల ఆధునికీకరణ, అంగన్వాడీ కేంద్రాలు తదితర అభివృద్ధి పనులు చేపడుతూ.. తద్వారా వేతనదారులకు ‘ఉపాధి’ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు నిధులు సమకూరుస్తోంది. అయితే ఆయా పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో గతంతో పోల్చుకుంటే సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లపై ఒత్తిడి చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా మారాయి. మండలంలో చిన్న తరహా నీటిపారుదల పథకం కింద 20 పనులకు రూ.2.5 కోట్లు ఉపాధి హామీ నిధులు మంజూరు కాగా 8 పనులకు పూర్తి చేశారు. వాటికి సంబంధించి ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో మరో 12 పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో ఈ ఏడాది పూర్తిస్థాయిలో భూములకు సాగునీరు అందివ్వలేని పరిస్థితి మండలంలో ఏర్పడింది. నాడు-నేడు కింద పాఠశాల భవనాల ఆధునికీకరణకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో కె.గీతాంజలిని వివరణ కోరగా ఉపాధి హామీ పనులకు సంబంధించి మెటీరియల్ నిధుల వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకుం టున్నామన్నారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఉందని తెలిపారు.