350 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టం
ABN , First Publish Date - 2023-03-18T23:49:05+05:30 IST
ఇటీవల ఈదురు గాలులతో కురిసిన వర్షానికి రైతులకు చెందిన మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని కురుపాం వ్యవసాయ సహాయ సంచాలకురాలు అలజంగి నిర్మల తెలిపారు.

కొమరాడ: ఇటీవల ఈదురు గాలులతో కురిసిన వర్షానికి రైతులకు చెందిన మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని కురుపాం వ్యవసాయ సహాయ సంచాలకురాలు అలజంగి నిర్మల తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో నేలకొరిగిన మొక్కజొన్న పంటను ఆమె శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గంగరేగువలస గ్రామానికి చెందిన 10 మంది రైతులకు చెందిన 15 ఎకరాలు, గుణానుపురం గ్రామంలో 28 మంది రైతులకు చెందిన 102 ఎకరాలు, దళాయిపేట గ్రామంలో 16 మంది రైతులకు చెందిన 35 ఎకరాలు, కళ్లికోటలో 90 మంది రైతులకు చెందిన 198 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లిందని వివరించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి పి.శంకరరావు, వ్యవసాయ సహాయకులు భావన, తదితరులు పాల్గొన్నారు.