కల్యాణం.. కమనీయం

ABN , First Publish Date - 2023-02-02T00:21:01+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో బుధవారం రాత్రి సీతారాముల తిరుక్కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. దేవస్థానం పరిసరాలు రామనామంతో మార్మోగాయి. భక్తులతో ఆవరణ అంతా కళకళలాడింది. దేవస్థానం ఆవరణలో పూలు, విద్యుత్‌ కాంతుల మధ్య అందంగా అలంకరించిన వేదికపై సీతారామలక్ష్మణులను అధిష్టింపజేశారు.

కల్యాణం.. కమనీయం
సీతారాముల కల్యాణోత్సవంలో మంగళసూత్రం చూపుతున్న అర్చకుడు

రామతీర్థంలో కన్నుల పండువగా సీతారాముల కల్యాణోత్సవం

రామనామంతో మార్మోగిన ఆలయం

నెల్లిమర్ల, ఫిబ్రవరి 1: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో బుధవారం రాత్రి సీతారాముల తిరుక్కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. దేవస్థానం పరిసరాలు రామనామంతో మార్మోగాయి. భక్తులతో ఆవరణ అంతా కళకళలాడింది. దేవస్థానం ఆవరణలో పూలు, విద్యుత్‌ కాంతుల మధ్య అందంగా అలంకరించిన వేదికపై సీతారామలక్ష్మణులను అధిష్టింపజేశారు. విశ్వక్షేణ పూజతో కల్యాణ తంతు ప్రారంభమైంది. ఈ వేడుకను తిలకించేందుకు విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కల్యాణోత్సవం బుధవారం అర్ధరాత్రి రెండున్నర గంటల వరకు సాగింది. ముందుగా నవ వధూవరులను వేర్వేరుగా ఊరేగింపు చేసే ఎదురు సన్నాహ కార్యక్రమం కనులవిందుగా జరిగింది. ఆనవాయితీగా సీతారామలక్ష్మణులను అశ్వ, గరుడ, హంస వాహనాలపై రామతీర్థం ప్రధాన వీధుల్లో ఊరేగించారు. ఈ తంతులో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వివాహ ఘట్టాన్ని ప్రారంభించారు. స్థానాచార్యులు గొడవర్తి నరసింహాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఖండవిల్లి సాయి రామాచార్యులు, ఖండవిల్లి కిరణ్‌, పాణంగిపల్లి ప్రసాద్‌, సుదర్శనం పవన్‌కుమార్‌, రామ్‌గోపాల్‌ తదితరులు కల్యాణ తంతును శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి డీవీవీ ప్రసాదరావు పర్యవేక్షించారు. వరుడు శ్రీరామచంద్రుడి తరపున ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు వ్యవహరించాల్సి ఉండగా ఆయన తరపున దేవ స్థానం అధికారులు పాల్గొని శ్రీరామచంద్రునికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అలాగే వధువు సీతమ్మ తరపున అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం పూసపాటిరేగకు చెందిన ఏకుల రామారావు కుటుంబీకులు హాజరై వివాహ సామగ్రిని సమకూర్చారు. సీతమ్మకు బంగారు శతమానాలతో పాటు పండ్లు, పట్టువస్త్రాలు, అరటి, కొబ్బరి పండ్లు సమకూర్చారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ ఉత్సవాన్ని భక్తులు కనులార్పకుండా చూసి ఆనందించారు. సీతమ్మ తలపై శ్రీరామచంద్రుడు జీలకర్ర బెల్లం పెట్టిన సన్నివేశం, తలంబ్రాలు జల్లుకున్న తంతు చూసి భక్తులు పులకించారు. వేడుకలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భోగాపురం సీఐ కేకేవీ విజయనాథ్‌ పర్యవేక్షణలో నెల్లిమర్ల ఎస్‌ఐ పి.నారాయణరావు బందోబస్తును ఏర్పాటు చేశారు.

వైభవంగా భీష్మ ఏకాదశి

విజయనగరం(ఆంధ్రజ్యోతి): భీష్మ ఏకాదశిని జిల్లా ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. విష్ణు ఆలయాలన్నీ నారాయణ నామస్మరణతో మార్మోగాయి. హిందూ సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశి, భీష్మ ఏకాదశిలకు ఎంతో ప్రాధాన్యం వుంది. విజయనగరంలోని మన్నార్‌ రాజగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనానికి భక్తులు బారులుతీరారు. మంచి రోజు కావడంతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. కొంతమంది శుభకార్యాలకు సంబంధించిన కార్డుల పంపణీకి ఈ రోజే శ్రీకారం చుట్టారు. ఎక్కడికక్కడ భక్తులు విష్ణు సాహస్ర నామార్చన చేయడం కనిపించింది.

Updated Date - 2023-02-02T00:21:03+05:30 IST