మరుగుదొడ్ల నిధుల దుర్వినియోగంపై విచారణ
ABN , First Publish Date - 2023-11-20T23:38:24+05:30 IST
కురుపాం మండలంలో మరుగుదొడ్ల నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం విజయనగరం జడ్పీ కార్యాలయానికి హాజరు కావాలని ప్రస్తుతం గరుగుబిల్లి ఎంపీడీవోగా ఉన్న పైడితల్లిని జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవో కె.రాజకుమార్ ఆదేశించారు.

గరుగుబిల్లి, నవంబరు 20 : కురుపాం మండలంలో మరుగుదొడ్ల నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం విజయనగరం జడ్పీ కార్యాలయానికి హాజరు కావాలని ప్రస్తుతం గరుగుబిల్లి ఎంపీడీవోగా ఉన్న పైడితల్లిని జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవో కె.రాజకుమార్ ఆదేశించారు. గతంలో కురుపాం ఎంపీడీవోగా పనిచేసిన జి.పైడితల్లి హయాంలో మరుగుదొడ్ల విషయంలో పలు అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో 2019 సెప్టెంబరు 13న ఆమెకు రాష్ట్ర కమిషనర్ చార్జి మెమోను జారీ చేశారు. అప్పటికి ఆమె వేరే మండలంలో ఎంపీడీవోగా ఉండడంతో విచారణకు హాజరు కాలేకపోయారు. ఆ తర్వాత ఈ ఏడాది మే 20న విచారణ చేయాలని అప్పటి జడ్పీ సీఈవో ఎం.అశోక్కుమార్ నిర్ణయించారు. వివిధ కారణాలతో విచారణ జరగలేదు. ఆ తర్వాత జూన్ 21న రెండో దఫా విచారణకు ఆదేశించినా అదీ జరగలేదు. దీంతో ఈనెల 21న విచారణ నిర్వహించాలని జడ్సీ సీఈవోను మరో ధపా కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు మూడోసారి విచారణకు సన్నద్ధమవుతున్నారు. కాగా కురుపాం మండలానికి సంబంధించి సుమారు రూ. 2.19 కోట్లు అప్పట్లో మంజూరయ్యాయి. ఆ సమయంలో సక్రమంగా రికార్డులు నిర్వహించలేదని ఉన్నతాధి కారులకు సమాచారం అందింది. ఈ నిధులకు సంబంధించి విచారణ అధికారిగా జడ్పీ సీఈవో కె.రాజ్కుమార్, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల గృహ నిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించారు. కురుపాం మండలంలో మరుగుదొడ్లు మంజూరు వివరాలతో పాటు అవసరమైన రికార్డులతో హాజరుకావాలని విజయనగరం జడ్పీ సీఈవో గరుగుబిల్లి ఎంపీడీవోకు ఆదేశాలు జారీ చేశారు. కాగా విచారణ పురస్కరించుకుని ఆమె రెండు రోజుల పాటు సెలవు పెట్టారు. దీనిపై జడ్పీ సీఈవో కె.రాజ్కుమార్ను వివరణ కోరగా మరుగుదొడ్ల అవకతవకలపై విచారణకు ఎంపీడీవోకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పూర్తి సమాచారంతో విజయనగరం జడ్పీ కార్యాలయానికి మంగళవారం హాజరుకావాలని సమాచారం అందించామని తెలిపారు.