ఆదమరిస్తే.. ఆసుపత్రికే..
ABN , First Publish Date - 2023-11-10T00:02:00+05:30 IST
పార్వతీపురం నుంచి పాలకొండ వైపు వెళ్లే ప్రధాన రహదారి.. అడుగుకో గొయ్యితో ప్రమాదకరంగా మారింది. ప్రధానంగా పార్వతీపురం మండలం అడ్డాపుశీల ప్రాంతంలో దారిపొడవునా భారీగా గోతులు ఏర్పడ్డాయి. పట్టుమని కిలోమీటరు కూడా సాఫీగా ప్రయాణించలేని పరిస్థితి
ఇది పార్వతీపురం నుంచి పాలకొండ వైపు వెళ్లే ప్రధాన రహదారి.. అడుగుకో గొయ్యితో ప్రమాదకరంగా మారింది. ప్రధానంగా పార్వతీపురం మండలం అడ్డాపుశీల ప్రాంతంలో దారిపొడవునా భారీగా గోతులు ఏర్పడ్డాయి. పట్టుమని కిలోమీటరు కూడా సాఫీగా ప్రయాణించలేని పరిస్థితి.. ఒక గోతిని తప్పించే లోపు మరో గొయ్యి దర్శనమిస్తోంది. ఆదమరిస్తే.. ఆసుపత్రి పాలవ్వక తప్పదు. ప్రస్తుతం బొబ్బిలి సమీపంలో పారాది వంతెన బలహీనంగా ఉండడంతో.. ఈ మార్గంలోనే భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో సాయంత్రం సమయంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువుగా ఉంటోంది. అయితే అధ్వానంగా మారిన ఈ రహదారి గుండా వాహనదారులు, ప్రజలు ప్రయాణాలు చేయలేకపోతున్నారు. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ మర్గంలో అడ్డాపుశీల నుంచి సంతోషపురం వరకు బీటీతో పాటు సీసీ రహదారి ఏర్పాటుకు ఆర్అండ్బీ అధికారులు రూ. 5 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. అయితే నెలలు గడుస్తున్నా నేటికీ నిధులు మంజూరు కాని పరిస్థితి. గోతులను పూడ్చేందుకు సంబంధిత సిబ్బందికి చేతి చమురు వదులుతోంది. కాగా ఈ రోడ్డులో ప్రమాదాల నివారణకు తాత్కాలికంగానైనా మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
- గరుగుబిల్లి