ఇళ్లు.. ఎప్పటికో!
ABN , First Publish Date - 2023-06-26T00:09:33+05:30 IST
విజయనగరం మండలం రాకోడు గ్రామంలోని జగనన్న లేఅవుట్లో 52 మంది మూడేళ్ల కిందట ఇంటి స్థలాలు పొందారు. వీరిలో ఇద్దరు పునాదులు తీసి విడిచిపెట్టారు. మిగిలిన 50 మంది స్థలాలను ఖాళీగా ఉంచారు.
జిల్లాలో ఇంటి నిర్మాణాలకు ముందుకు రాని లబ్ధిదారులు
చాలా గ్రామాల్లో పునాదులు కూడా వేయని వైనం
వచ్చే మార్చిలోగా ఇళ్లు సిద్ధం కావాలంటున్న ప్రభుత్వం
కలెక్టరేట్, జూన్ 25:
- విజయనగరం మండలం రాకోడు గ్రామంలోని జగనన్న లేఅవుట్లో 52 మంది మూడేళ్ల కిందట ఇంటి స్థలాలు పొందారు. వీరిలో ఇద్దరు పునాదులు తీసి విడిచిపెట్టారు. మిగిలిన 50 మంది స్థలాలను ఖాళీగా ఉంచారు. ఊరికి ఎగువ భాగంలో లేఅవుట్ ఏర్పాటు చేయడంతో ఇళ్లు నిర్మించడానికి లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికి దాదాపుగా పదిసార్లు లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చారు.
- గంట్యాడ మండలంలోని మదనాపురంలో 68 మందికి జగనన్న లేఅవుట్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. తాటిపూడి రిజర్వాయర్ సమీపంలోని హైవే రోడ్డుకు ఆనుకుని ఉన్న చోట ఈ లేవుట్ను ఏర్పాటు చేశారు. 68 మందిలో ఒక లబ్ధిదారుడు మాత్రమే స్లాబ్ వేశాడు. మిగిలిన వారు పునాదులు నిర్మించి విడిచిపెట్టారు. సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి పనులు చేపట్టడం లేదు. లబ్ధిదారులకు మూడు నుంచి ఐదు సార్లు నోటీసులు ఇచ్చినా ముందడుగు పడటం లేదు.
జిల్లా అంతటా ఇవే సమస్యలు ఉన్నాయి. ఇళ్ల నిర్మాణంపై అధికారులు తీవ్ర స్థాయిలో లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నా ఆశించిన స్థాయిలో నిర్మాణాల్లో పురోగతి కన్పించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 2020 డిసెంబర్లో 77,021 ఇళ్లు మంజూరు చేయగా 31,039 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మంజూరు చేసిన వాటిల్లో కొన్ని రద్దు చేశామంటున్నారు. 4224 ఇళ్లకు ఇంకా పునాదులు తీయలేదు. మిగతావన్నీ వివిధ స్థాయిల్లో ఉన్నాయి. వాస్తవానికి ఉగాదికి సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అనుకున్న స్థాయిలో నిర్మాణాలు జరగక ఆగస్టు నెలకు వాయిదా వేసింది. అయితే రానున్నది వర్షాకాలం కావడంతో ఇంటి నిర్మాణాలకు అనుకూలంగా ఉండదు. మళ్లీ డిసెంబరు నుంచి మాత్రమే అవకాశం ఉంటుంది. మరోవైపు సిమెంట్, ఇసుక, ఐరన్ ధరలు పెరగడంతో నిర్మాణదారులు ఇళ్ల నిర్మాణం అంటేనే హడలి పోతున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వచ్చే ఏడాది మార్చిలోగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం ఇటీవల స్పష్టంచేసింది. ఈలోగా నిర్మాణాలు పూర్తి అవుతాయా? లేదా ? అనేది ప్రభుత్వమే చెప్పాలి.
జిల్లాలో పేదల ఇళ్ల నిర్మాణాల అంశాన్ని ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్వీ రమణమూర్తి వద్ద ప్రస్తావించగా మంజూరు చేసిన ఇళ్లలో ఎవరైనా లబ్ధిదారులు ప్రారంభించకపోతే వాటిని రద్దు చేసి కొత్తవారికి మంజూరు చేస్తామన్నారు. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న వాటిని వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.