గురజాడ రచనలు ఎప్పటికీ పదిలం
ABN , First Publish Date - 2023-09-22T00:04:48+05:30 IST
ఎన్ని తరాలు మారినా గురజాడ రచనలు ప్రజల మదిలో నిలిచే ఉంటాయని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అన్నారు. మహాకవి గురజాడ అప్పారావు 161వ జయంతిని పురస్కరించుకుని విజయనగరంలోని ఆయన స్వగృహంలో చిత్రపటానికి గురువారం పూలమాల వేసి నివాళి అర్పించారు.
గురజాడ రచనలు ఎప్పటికీ పదిలం
ఆయన అడుగుజాడల్లో నడవండి
కలెక్టర్ నాగలక్ష్మి
విజయనగరం రూరల్, సెప్టెంబరు 21: ఎన్ని తరాలు మారినా గురజాడ రచనలు ప్రజల మదిలో నిలిచే ఉంటాయని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అన్నారు. మహాకవి గురజాడ అప్పారావు 161వ జయంతిని పురస్కరించుకుని విజయనగరంలోని ఆయన స్వగృహంలో చిత్రపటానికి గురువారం పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ గురజాడ చెప్పిన సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి సాయపడవోయ్ మాటలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. ప్రధానంగా యువత ఆయన బాటలో నడవాలని సూచించారు. గురజాడ స్వగృహానికి, లైబ్రరీకి సందర్శకులు వస్తున్న దృష్ట్యా వారి సౌకర్యార్థం మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. గురజాడ స్వగృహానికి ఇటీవలే పెయింటింగ్స్ వేయించి కొంత మేర అభివృద్ధి చేశామన్నారు. జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ గురజాడ లైబ్రరీలో మౌలిక వసతుల కల్పనకు జిల్లా పరిషత్ నుంచి నిధులు సమకూర్చుతున్నట్టు చెప్పారు. అంతకుముందు గురజాడ ఇంటి నుంచి కవులు, కళాకారులు ఊరేగింపుగా అదే రోడ్డులోని గురజాడ విగ్రహం వద్దకు చేరుకున్నారు. విద్యార్థులు గురజాడ రచించిన దేశభక్తి గేయాలను ఆలపించారు. కార్యక్రమంలో జేసీ మయూర్అశోక్, గురజాడ కుటుంబ సభ్యులు ప్రసాద్, ఇందిర, నగర మేయర్ విజయలక్ష్మీ, సహాయ కలెక్టరు వెంకట త్రివినాగ్, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీరాముల నాయుడు, జిల్లా పర్యాటక శాఖాధికారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
- జేఎన్టీయూలో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి వీసీ వెంకటసుబ్బయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గురజాడ రెండు శతాబ్దాల ముందుచూపు కలికిన గొప్ప దార్శనికుడని చెప్పారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి.జయసుమ పాల్గొన్నారు.
================