ఇక పరిశీలన
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:30 AM
ఓటర్ల తుది జాబితాను వచ్చే ఏడాది జనవరి 5న ప్రకటించనున్నారు. అందులో పేర్లు ఉన్నవారే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కడా పొరపాట్లు లేకుండా ఓటరు జాబితా రూపొందించాల్సి ఉంది.
తొలగింపునకు 43,114 పత్రాలు అందజేత
కొమరాడ, డిసెంబరు 17 : ఓటర్ల తుది జాబితాను వచ్చే ఏడాది జనవరి 5న ప్రకటించనున్నారు. అందులో పేర్లు ఉన్నవారే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కడా పొరపాట్లు లేకుండా ఓటరు జాబితా రూపొందించాల్సి ఉంది. అయితే నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారానికి గడువు తక్కువగా సమయం ఉందని, బీఎల్వోలు ఇంటికి వెళ్లకుండా పరిష్కరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా ఓటరు నమోదు, తొలగింపులు, మార్పులు, చేర్పులకు సంబంధించి ఈ నెల 9తో గడువు ముగిసింది. వచ్చిన దరఖాస్తులను పరిష్కారించేందుకు ఈ నెల 27 వరకు అవకాశం ఉంది. 2024 జనవరి 5న తుది జాబితాను ప్రచరిస్తారు. ఈ జాబితా ఆధారంగా రానున్న సాధారణ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. కాగా జిల్లాలో అక్టోబరు 17 నుంచి ఈ నెల 9 వరకు పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్లుగా నమోదుకు దరఖాస్తులు వచ్చాయి. కురుపాం, పార్వతీపురం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల పరిధిలో 7,70,525 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3,76,220 మంది పురుషులు, 3,94,240 మంది మహిళలు, 65 మంది ఇతరులు ఉన్నారు. కాగా 43,114 మందిని తొలగించేందుకు ఫారం-7లు రాగా, మార్పుల కోసం ఫారం-8లను 97,250 మంది సమర్పించారు. కొత్తగా ఓటరుగా నమోదుకు ఫారం-6లను 31,719 మంది అందించారు. అయితే వచ్చిన దరఖాస్తుల్లో ఏ మేరకు పరిష్కరిస్తారన్నది.. జనవరి 5న విడుదల కానున్న తుది జాబితాలో తేలనుంది.