వంశధారకు వరద
ABN , First Publish Date - 2023-08-02T00:31:55+05:30 IST
ఒడిశాలో కురుస్తున్న వర్షాల వల్ల మంగళవారం మండల పరిధిలోని వంశధారలో స్వల్పంగా వరద పెరిగింది. దీంతో ఆంధ్రా-ఒడిశా నదీ తీర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
భామిని: ఒడిశాలో కురుస్తున్న వర్షాల వల్ల మంగళవారం మండల పరిధిలోని వంశధారలో స్వల్పంగా వరద పెరిగింది. దీంతో ఆంధ్రా-ఒడిశా నదీ తీర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాస్తవంగా నేరడి నదీ తీరంలో ఒక పడవ ఉంది. నిత్యం ఆంధ్రా-ఒడిశా వాసులు ఆ పడవను ఆశ్రయించి రెండు కిలోమీటర్ల మేర నది దాటి వారి స్వగ్రామాలకు చేరుతుంటారు. అయితే ప్రస్తుతం వరద ప్రవాహం పెరగడంతో వారు కొత్తూరు లేదా బత్తిలి మీదుగా 30 కిలోమీటర్లు చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. నది అవతల ఒడిశాలోని కాశీనగరం, బూదర, బొత్తవ, వన్న, గౌరి, పురిటిగూడ, ఖండవ గ్రామాలున్నాయి. నది ఇవతల భామిని, బాలేరు, దిమ్మిడిజోల, లివిరి, పసుకుడి, సింగిడి తదితర గ్రామాలున్నాయి. మరో నాలుగు నెలల వరకు ఇదే పరిస్థితి ఉండడంతో వారికి అవస్థలు తప్పేలా లేవు.
తోటపల్లిలో ఇలా..
గరుగుబిల్లి: తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరిగింది. పైప్రాంతం నుంచి 7,500 క్యూసెక్కులకు పైగా చేరడంతో ప్రాజెక్టు అధికారులు మంగళవారం స్పిల్వే గేట్లు నుంచి 4,600 క్యూసెక్కులను దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 342.03 అడుగుల మేర నీటి నిల్వ ఉందని ప్రాజెక్టు జేఈలు శ్రీనివాసరావు, కిషోర్కుమార్, నవీన్కుమార్ తెలిపారు. సాగునీరు సరఫరా నిమిత్తం కుడి ప్రధాన కాలువ నుంచి 800 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాలువ నుంచి 200 క్యూసెక్కులు, పాత బ్యారేజీ పరిధిలోని కుడి కాలువ నుంచి 90 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఒడిశాలో అధికంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, నదీ తీర ప్రాంతవాసులు కొంతమేర అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో స్నానాలు, చేపలు వేటకు వెళ్లకూడదన్నారు.