ముంపు బారిన బాసంగి
ABN , First Publish Date - 2023-09-22T00:02:16+05:30 IST
మండలంలోని నిర్వాసిత గ్రామమైన బాసంగిని వరద చుట్టుముట్టింది. బుధవారం రాత్రి ఒడిశా రాష్ట్రంలోని రాయగడ, తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు కారణంగా నాగావళి నదికి వరద ఉధృతి ఎక్కువయ్యింది. దీంతో తోటపల్లి ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో సమీపంలోని బాసంగి గ్రామానికి ప్రమాద ఘంటికలు ఏర్పడ్డాయి.
జియ్యమ్మవలస, సెప్టెంబరు 21: మండలంలోని నిర్వాసిత గ్రామమైన బాసంగిని వరద చుట్టుముట్టింది. బుధవారం రాత్రి ఒడిశా రాష్ట్రంలోని రాయగడ, తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు కారణంగా నాగావళి నదికి వరద ఉధృతి ఎక్కువయ్యింది. దీంతో తోటపల్లి ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో సమీపంలోని బాసంగి గ్రామానికి ప్రమాద ఘంటికలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం గ్రామ పాఠశాల ముంపునకు గురైంది. అలాగే గ్రామ చివరి వీధికి కూడా వరద నీరు తాకింది. దీంతో ఒక రేకుల షెడ్డులో గురువారం విద్యార్థులకు బోధనసాగించారు. దీంతో రెవెన్యూశాఖ అప్రమత్తమైంది. తహసీల్దార్ డీవీ సీతారామయ్య స్పందించి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సీతారామరాజు, గవరమ్మపేట, పెదమేరంగి వీఆర్వోలు మెరకయ్య, దుర్గాప్రసాద్ను బాసింగికి పంపించి వారి ద్వారా పరిస్థితిని సమీక్షించారు. వెంటనే తోటపల్లి ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి దిగువకు నీటిని విడుదల చేయించడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.