పైపులైన్ లీకులను పట్టించుకోరా?
ABN , First Publish Date - 2023-09-04T00:14:58+05:30 IST
సాలూరు మునిసిపల్వాసులకు రక్షిత నీరు అందిస్తున్నామని గొప్పలు చెబుతున్న పాలకవర్గం పైపులైన్ లీకులను మాత్రం పట్టించుకోవడం లేదని పట్టణవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రక్షిత పథకం నుంచి కొళాయిలకు నీటిని సరఫరా చేసే మెయిన్ పైపులైన్లకు లీకులు ఉండడంతో తాగునీరు వృథాగా పోతుంది.
-కొన్నిచోట్ల కలుషితమవుతున్న జలాలు
సాలూరు రూరల్, సెప్టెంబరు 3: సాలూరు మునిసిపల్వాసులకు రక్షిత నీరు అందిస్తున్నామని గొప్పలు చెబుతున్న పాలకవర్గం పైపులైన్ లీకులను మాత్రం పట్టించుకోవడం లేదని పట్టణవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రక్షిత పథకం నుంచి కొళాయిలకు నీటిని సరఫరా చేసే మెయిన్ పైపులైన్లకు లీకులు ఉండడంతో తాగునీరు వృథాగా పోతుంది. సాలూరు పట్టణంలో దాదాపు 57 వేల మంది జనాభా ఉన్నారు. 3,650 కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పాత పైపులైన్ కావడంతో పలు చోట్ల లీకులు ఏర్పడ్డాయి. జయపూర్ రోడ్డులోని లయన్స్క్లబ్ సమీపంలో, దండిగాం రోడ్డులోని డబ్బివీధి పాఠశాల సమీపంలో, అదే పాఠశాల సమీపంలోని పెదకోమటిపేటకు వెళ్లే రోడ్డులో పైపులైన్కు లీకులు ఏర్పడి నెలలు గడుస్తున్నా పాలకవర్గం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తాగునీరు పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదని వాపోతున్నారు. లీకైన నీరు నెలల తరబడి నిల్వ ఉండడంతో కలుషితమై మళ్లీ పైపులైన్ ద్వారా వచ్చేస్తుందని, తక్షణమే పైపులైన్ లీకులను అరికట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు.