బాల్యం బంది
ABN , First Publish Date - 2023-02-14T00:06:26+05:30 IST
వైద్యఆరోగ్య శాఖ గర్భిణీల ఆన్లైన్ నమోదు ప్రక్రియలో తక్కువ వయసులో వివాహాలు జరుగుతున్నట్టు గుర్తించారు. కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ప్రత్యేకంగా దృష్టిసారించారు. జిల్లా వ్యాప్తంగా 50 వరకూ బాల్య వివాహాలు జరిగినట్టు గుర్తించారు. సంబంధించి సచివాలయ ఆరోగ్య కార్యదర్శులు (ఏఎన్ఎం)ను కార్యాలయానికి పిలిపించి క్లాస్ తీసుకున్నారు. గ్రామాల్లో బాల్య వివహాలకు అడ్డుకట్ట వేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బాల్యం బంది
జిల్లాలో పెరుగుతున్న బాల్య వివాహాలు
గర్భిణీల ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో వెలుగుచూస్తున్న వాస్తవాలు
పేపర్లకే పరిమితమవుతున్న నియంత్రణ చర్యలు
కానరాని నిరోధక, పర్యవేక్షక కమిటీలు
(శృంగవరపుకోట)
వైద్యఆరోగ్య శాఖ గర్భిణీల ఆన్లైన్ నమోదు ప్రక్రియలో తక్కువ వయసులో వివాహాలు జరుగుతున్నట్టు గుర్తించారు. కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ప్రత్యేకంగా దృష్టిసారించారు. జిల్లా వ్యాప్తంగా 50 వరకూ బాల్య వివాహాలు జరిగినట్టు గుర్తించారు. సంబంధించి సచివాలయ ఆరోగ్య కార్యదర్శులు (ఏఎన్ఎం)ను కార్యాలయానికి పిలిపించి క్లాస్ తీసుకున్నారు. గ్రామాల్లో బాల్య వివహాలకు అడ్డుకట్ట వేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. అవగాహన లేక తల్లిదండ్రులు చిన్నవయసులో వివాహం చేస్తున్నారు. వారి ఆనారోగ్యానికి కారకులవుతున్నారు. ఆడపిల్ల ఇంటి వద్ద ఉంటే భారంగా పరిణమించే తల్లిదండ్రులు వివాహాలకు సిద్ధపడుతున్నారు.కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ యాప్ ప్రవేశపెట్టింది. గర్భిణీల వివరాలు అందులో నమోదు తప్పనిసరి. ఆధార్తో పాటు పుట్టిన తేదీ వివరాలు తప్పకుండా పొందుపరచాలి. దీంతో బాల్య వివాహాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. అయితే బాల్య వివాహాల నియంత్రణ బాధ్యత ఒక్క వైద్యఆరోగ్య శాఖదే కాదు. అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి, స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, అంగన్వాడీ కార్యకర్త.. ఇలా అందరూ బాల్య వివాహాల నియంత్రణలో బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా బాల్య వివాహం జరిపిస్తే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. బాల్య వివాహంతో కలిగే దుష్పరిణామాలను వివరించాలి. అప్పటికీ వారు వినకుంటే మాత్రం పోలీసులను ఆశ్రయించాలి.
ఇలా చేయాలి
ఇటీవల సచివాలయంలో మహిళా పోలీస్ను కూడా నియమించారు. వీరి విధుల్లో ప్రధానమైనది కూడా బాల్య వివాహాల నియంత్రణే. కానీ వీరు విఫలమవుతున్నారన్న విమర్శ ఉంది. సచివాలయ పరిధిలోని 9 నుంచి 21 సంవత్సరాల మధ్య కిశోర బాలికలను గుర్తించి సఖీ గ్రూపుగా ఏర్పాటు చేయాలి. నెలకోసారి ఆరోగ్యం, పోషకాహారం గురించి చర్చించడంతో పాటు బాల్య వివాహాల నిరోధక చట్టం గురించి తల్లిదండ్రులకు, బాలికలకు అవగాహన కల్పించాలి. 2006లో బాల్య వివాహాల నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది. జిల్లాస్థాయిలో కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్డీవో, మూడు నుంచి ఐదు మండలాలతో కలిసి ఉన్న ప్రాజెక్ట్ కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులు, మండలస్థాయిలో తహసీల్దార్లు, గ్రామస్థాయిలో కార్యదర్శి, వీఆర్వో, ఐసీడీఎస్ పర్యవేక్షకులను నియమించారు. వీరికి పోలీస్ అధికారులకు ఉన్న అధికారాలతో పాటు దర్యాప్తు, కేసులో పార్టీలను పిలిపించే అధికారం, సాక్షుల నుంచి నివేదికలు స్వీకరించి రికార్డు చేసే అధికారం, నేరం చేసిన వారిపై కేసులు పేట్టే అధికారం ఉంది.
రాజకీయ ఒత్తిళ్లతో..
అయితే ప్రభుత్వం ఎన్ని చట్టాలను ప్రవేశపెట్టినా గ్రామాల్లో మాత్రం బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఒకవేళ అధికారులు జోక్యం చేసుకుంటున్నా అక్కడ రాజకీయ నేతలు ఎంటరవుతున్నారు. రకరకాల కారణాలు చెప్పి అధికారులను నియంత్రిస్తున్నారు. వాస్తవానికి పంచాయతీ సర్పంచ్ అధ్యక్షుడిగా, కార్యదర్శి, వీఆర్వో, ఉపాధ్యాయుడు, గ్రామ సమైఖ్య సభ్యులు, వార్డు సభ్యులు, ఏఎన్ఎం, యువసమైఖ్య, గ్రామాధికారులు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు వివాహల వద్దకు వెళ్లి నిబంధనల ప్రకారం వివాహాలు జరుగుతున్నాయో పరిశీలించాలి. బాల్య వివాహాలు జరిగితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలి. కానీ ఇవేవీ జరగడం లేదు. బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడడం లేదు.
అనర్థాలివే..
- తక్కువ వయసులో వివాహం చేస్తే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. పిల్లలపై ప్రభావం చూపుతుంది. వారి శారీరక, మానసిక ఎదుగుదలకు అడ్డంకులు వస్తాయి.
- తక్కువ వయసులో అటు భర్తతో పాటు అత్తింట్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అనుభవరాహిత్యంతో కుటుంబ బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించలేదు. కుటుంబ కలహాలు దారితీస్తాయి. వివాహ బంధం విచ్ఛిన్నం కావడానికి కారణమవుతారు.
- చిన్న వయసులో వివాహాలతో మాతా శిశు మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటోంది. చాలా రకాల రుగ్మతలకు దారితీస్తున్నాయి.
అవగాహన పెంచుతున్నాం
బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను తల్లిదండ్రులకు వివరిస్తున్నాం. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినట్టు సమాచారం వస్తే వెంటనే స్పందిస్తున్నాం. అడ్డుకుంటున్నాం. ఆదేశాలు బేఖాతరు చేసిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కేసులు నమోదుచేయిస్తున్నాం.
ఉమ, సీడీపీవో, ఎస్.కోట