నెల్లిమర్ల టీడీపీ ఇన్చార్జిగా బంగార్రాజు
ABN , First Publish Date - 2023-02-04T00:20:41+05:30 IST
నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా కర్రోతు బంగార్రాజు నియమితులయ్యారు. గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరదించుతూ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ టీడీపీ ఇన్చార్జిగా మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు ఉన్నారు. వయోభారంతో ఆయన్ను తప్పిస్తారని గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది.
నెల్లిమర్ల టీడీపీ ఇన్చార్జిగా బంగార్రాజు
నియామక ఉత్తర్వులు జారీచేసిన అధిష్ఠానం
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా కర్రోతు బంగార్రాజు నియమితులయ్యారు. గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరదించుతూ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ టీడీపీ ఇన్చార్జిగా మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు ఉన్నారు. వయోభారంతో ఆయన్ను తప్పిస్తారని గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో నారాయణస్వామినాయుడే టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. కానీ ఓటమి చవిచూశారు. అయినా అధిష్టానం నియోజకవర్గ బాధ్యతలను ఆయనకే అప్పగించింది. కానీ అధికార పార్టీ అభ్యర్థిని ఢీకొట్టాలంటే బలమైన అభ్యర్థి కావాలని అధినేత భావించారు. అయితే తనను తప్పిస్తే కుమారుడికి బాధ్యతలు అప్పగించాలని పతివాడ కోరుతూ వచ్చారు. ఈ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పార్టీకి బలమైన కేడర్ ఉంది. డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్, నెల్లిమర్ల మాజీ ఎంపీపీ సువ్వాడ రవిశేఖర్ వనజాక్షి, కడగల ఆనంద్ కుమార్లు సైతం నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను ఆశించారు. కానీ హైకమాండ్ మాత్రం భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు వైపే మొగ్గుచూపింది. గత కొద్దిరోజులుగా బంగార్రాజు పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాడుతున్నారు. ఆర్థికంగా బలమైన నేతగా గుర్తింపు కూడా ఉంది. నియోజకవర్గంలో మిగతా నాయకులను సమన్వయం చేసుకుంటారని భావించి అధిష్టానం బంగార్రాజును ఎంపిక చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నియామక ఉత్తర్వులు జారీచేశారు. కాగా నియోజకవర్గ ఇన్చార్జిగా బంగార్రాజు ఎంపికపై ఆయన వర్గీయులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.