బాబుకు బెయిల్
ABN , First Publish Date - 2023-11-20T23:41:54+05:30 IST
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. నియోజకవర్గ కేంద్రాలతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

పార్వతీపురం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. నియోజకవర్గ కేంద్రాలతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి సందడి చేశారు. న్యాయమే గెలిచిందని పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలోని టీడీపీ కార్యాలయం ప్రాంగణంలో మాజీ మంత్రి కళా వెంకటరావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ జగదీష్, పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జి విజయచంద్ర తదితరులు శ్రేణులతో కలిసి బాణసంచా కాల్చారు. అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం కళా విలేఖర్లతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై వైసీపీ సర్కారు అక్రమంగా కేసు బనాయించిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగినట్టు నిరూపించలే కపోయారన్నారు. తమ అధినేత కడిగిన ముత్యం లాంటి వారని తెలిపారు. అవినీతి పాలనతో రాష్ర్టాన్ని అన్నింటా వెనక్కి నెట్టేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఓటు ఆనే ఆయుధంతో సర్కారును ఇంటికి పంపించాలని ప్రజలను కోరారు.