కోడికత్తి కేసులో స్వాధీనం చేసుకున్న వస్తువులేవీ?

ABN , First Publish Date - 2023-03-08T02:17:44+05:30 IST

‘కోడికత్తి’ కేసులో దర్యాప్తు అధికారులు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను కోర్టుకు తీసుకురాకపోవడం పట్ల ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

కోడికత్తి కేసులో స్వాధీనం చేసుకున్న వస్తువులేవీ?

కోర్టుకు తీసుకురావాలని తెలీదా?.. దర్యాప్తు అధికారిపై జడ్జీ ఆగ్రహం

విజయవాడ, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ‘కోడికత్తి’ కేసులో దర్యాప్తు అధికారులు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను కోర్టుకు తీసుకురాకపోవడం పట్ల ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘సాక్ష్యం చెప్పడానికి సాక్షులను తీసుకొస్తున్నారు. కేసుకు సంబంధించిన మెటీరియల్‌ను తీసుకురారా? ఈ విషయం దర్యాప్తు అధికారి(ఐవో)కు తెలియదా? అసలు కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా’’ అని విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయమూర్తి ప్రశ్నించారు. విశాఖపట్నం విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన కోడికత్తి దాడి ఘటనకు సంబంధించి మంగళవారం ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది. ఘటన జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సీఐఎ్‌సఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ దినేశ్‌ కుమార్‌ను సాక్షిగా విచారించారు. ఘటన జరిగిన తర్వాత నిందితుడి నుంచి ఏయే వస్తువులు స్వాధీనం చేసుకున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. కోడికత్తితోపాటు పర్సు, బెల్టు వంటి వస్తువులను స్వాఽధీనం చేసుకున్నామని దినేశ్‌కుమార్‌ వివరించారు. వాటిని చూపించమని న్యాయమూర్తి అడిగారు. దీంతో నీళ్లునమిలిన దినేశ్‌కుమార్‌.. తీసుకురాలేదని సమాధానం ఇచ్చారు. దీనిపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-08T02:17:44+05:30 IST