మరి.. ఇవి ఏమూలకు సరిపోతాయి?
ABN , First Publish Date - 2023-03-17T00:40:38+05:30 IST
జంఝావతి హైలెవల్ కెనాల్ దుస్థితి ఇది. గత కొద్దిరోజులుగా నిర్వహణ లేక ఇలా ఆనవాళ్లు కోల్పోయింది. పిచ్చి మొక్కలతో పాటు పూడిక పేరుకుపోయింది. దీంతో శివారు ఆయకట్టుకు సాగునీరందని దుస్థితి. ఈ ఏడాది బడ్జెట్లోనై జంఝావతికి కేటాయింపులు చేస్తారని ఆశించారు. కానీ కేవలం రూ.36 లక్షలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. రిజర్వాయర్ నిర్వహణలో భాగంగా విద్యుత్ చార్జీలకు కూడా ఆ మొత్తం చాలదు. అంటే ఈ ఏడాది కూడా జంఝావతి అభివృద్ధికి అడుగుపడనట్టే.
మరి.. ఇవి ఏమూలకు సరిపోతాయి?
జంఝావతి ప్రాజెక్టుకు ఇచ్చింది రూ.36 లక్షలు
నాడు రూ.36 కోట్లు ఎలా సరిపోతాయన్న జగన్
అధికారంలోకి వచ్చాక విస్మరించిన వైనం
రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు తీవ్ర అన్యాయం
కొత్తవాటి ఊసులేదు.. ఉన్నవాటికి ఊరడింపు లేదు
రూ.350 కోట్లు అవసరమున్న తోటపల్లికి రూ.81 కోట్లే
వీఆర్ఎస్ జపాన్ నిధులు ప్రభుత్వ ఖాతాల్లో
జిల్లాకు ఊరటనివ్వని బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్
(పార్వతీపురం, ఆంధ్రజ్యోతి)
జంఝావతి హైలెవల్ కెనాల్ దుస్థితి ఇది. గత కొద్దిరోజులుగా నిర్వహణ లేక ఇలా ఆనవాళ్లు కోల్పోయింది. పిచ్చి మొక్కలతో పాటు పూడిక పేరుకుపోయింది. దీంతో శివారు ఆయకట్టుకు సాగునీరందని దుస్థితి. ఈ ఏడాది బడ్జెట్లోనై జంఝావతికి కేటాయింపులు చేస్తారని ఆశించారు. కానీ కేవలం రూ.36 లక్షలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. రిజర్వాయర్ నిర్వహణలో భాగంగా విద్యుత్ చార్జీలకు కూడా ఆ మొత్తం చాలదు. అంటే ఈ ఏడాది కూడా జంఝావతి అభివృద్ధికి అడుగుపడనట్టే.
జిల్లా ప్రజలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిరుత్సాహపరిచారు. కొత్త జిల్లా కావడంతో ‘ప్రత్యేక’ కేటాయింపులు ఉంటాయని జిల్లావాసులు భావించారు. కానీ అటువంటివి ఏవీలేవు. కొత్తవాటి ఊసులేకపోగా.. ఉన్నవాటికి అరకొర కేటాయింపులే. జిల్లాల పునర్విభజన తరువాత తొలి బడ్జెట్ ఇది. నాలుగు నియోజకవర్గాలతో పార్వతీపురం మన్యం జిల్లా ఆవిర్భావించింది. దాదాపు గ్రామీణ ప్రాంతాలు అధికం. ఇక్కడి ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగు పరిచేందుకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని ప్రజలు ఆశించారు. కానీ ‘ప్రత్యేక’ కేటాయింపులన్న ఊసులేదు. రాష్ట్రస్థాయిలో విద్య, వైద్యరంగాలకు చేసిన కేటాయింపులతోనే సరిపెట్టారు. జిల్లాకు ప్రత్యేక ప్రాజెక్టులేవీ కేటాయింపులు చేయలేదు. నవరత్నాల్లో భాగంగా చేసిన కేటాయింపుల్లో జిల్లాల లెక్కలు కట్టి గణాంకాలు చూపే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై జిల్లా ప్రజలు పెదవివిరుస్తున్నారు. ఎన్నికల చివరి ఏడాది కావడంతో కొండంత ఆశతో ఉన్నవారు నీరుగారిపోయారు.
నాటి మాటలు ఏమయ్యాయో?
‘జంఝావతి ప్రాజెక్టు అభివృద్ధికి రూ.30 కోట్లేనా? ఇవి ఏమూలకు సరిపోతాయి. ప్రాజెక్టులపై ఇదేనా శ్రద్ధ? ఈ నిధుల సంఖ్య పెంచాలి. లేకుంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నిధుల కేటాయింపు చేస్తాం. ప్రాజెక్ట్ పనులు పూర్తిచేస్తాం’.. విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చెప్పుకొచ్చిన మాట ఇది. కానీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తోంది. కేటాయింపులు చేశారా? అంటే అదీ లేదు. ఇప్పుడు ముచ్చటగా ఐదోసారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ఈసారి కూడా కేవలం రూ.36 లక్షలు కేటాయించి తన అంతులేని ఉదారతను చాటుకున్నారు. కనీసం విద్యుత్ చార్జీలకు కూడా ఈమొత్తం చాలదని అధికారవర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి జంఝావతి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తిచేయడంపై తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. రూ.30 కోట్లు మంజూరుచేసి పనులు కూడా ప్రారంభించింది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీన్ మారింది. 25 శాతం లోపు పనులు అంటూ నిలిపివేసింది. రీ టెండరింగ్ తెరపైకి తెచ్చింది. అయితే పనులు పూర్తిచేసేందుకు కనీస ప్రయత్నం చేయలేదు. కేవలం ప్రకటనలకే పరిమితమైంది. అదిగో..ఇదిగో అంటూ కాలయాపనే తప్ప ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఎన్నికల చివరి ఏడాది బడ్జెట్లోనైనా మోక్షం కలుగుతుంటే ఇప్పుడు కూడా రిక్తహస్తమే ఎదురైంది.
తోటపల్లికి అరకొర
ఇప్పుడున్న పరిస్థితుల్లో తోటపల్లి ఆధునికీకరణ పనులకు కనీసం రూ.350 కోట్లు అవసరం. కానీ ఈ బడ్జెట్లో కేటాయించిన మొత్తం కేవలం రూ.81 కోట్లు. ఇందులో ఎంత మంజూరవుతుందన్నది అనుమానమే. దీనికి గత బడ్జెట్లో కేటాయింపులే ఉదాహరణ. నిధులు ఉన్నాయని అధికారులు చెబుతుంటారు. కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లుల చెల్లింపులు లేవు. దీంతో పనులు చేసేందుకు వారు కూడా ముందుకు రాని దుస్థితి. అయితే ఏటా తోటపల్లి ప్రాజెక్టును ప్రాధాన్యతనిస్తున్నారు. కానీ అంకెల గారడీ సృష్టిస్తున్నారన్న అపవాదు ఉంది. ఈ బడ్జెట్లో రూ.81 కోట్లు కేటాయించడంతో వీలైనంతవరకూ నిధులు మంజూరుచేసి పట్టాలెక్కించాలని పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల రైతులు కోరుతున్నారు.
భూసేకరణకే రూ.150 కోట్లు అవసరం
వాస్తవానికి తోటపల్లి తక్షణ పనులకు రూ.150 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఒక్క భూసేకరణకే రూ.100 కోట్లు అవసరం.మెయిన్ కెనాల్ నుండి 9 డిస్ర్టిబ్యూటర్లను ఏర్పాటుచేయవలసి ఉంది. అలాగే ప్రధాన కాలువల నుంచి పిల్ల కాలువలు నిర్మించాల్సి ఉంది. స్పిల్వే రెగ్యులేటర్ వద్ద కొత్తగా పనులు చేపట్టాల్సి ఉంది. చాలావరకూ పెండింగ్ పనులు ఉన్నాయి. వీటికే రూ.150 కోట్లు అవసరం. విజయనగరం జిల్లా గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులు సైతం పూర్తిచేయాల్సి ఉంది. బొబ్బిలి మండలంలో చాలా ఆయకట్టుకు సాగునీరందదు. అలు పాలకొండ ప్రాంతానికి వెళ్లే పాత ఆయకట్టుకు సంబంధించిన కాలువలను ఆధునీకరించాల్సి ఉంది. ఇన్ని పనులు పెట్టుకొని రూ.81 కోట్లు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం వెంగళరాయసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారుల నిర్ణయించారు. జపాన్ నిధులు రూ.14.72 కోట్లు మంజూరైనట్టు ప్రకటించారు. ఇప్పుడవే లెక్కలను బడ్జెట్లో వేసి చూపుతుండడం గమనార్హం.