అనుమతిచ్చారు.. ఆపేమన్నారు
ABN , First Publish Date - 2023-02-06T23:57:21+05:30 IST
‘వాటర్ షెడ్ నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చారు. దీంతో ఐదు రోజులు దగ్గరుండి పని చేయించాను. అంతలో వైసీపీ నేతల నుంచి పైరవీలు మొదలయ్యాయి. పని ఆపేసివైసీపీ నేతలకు అప్పగించారు. ఇదేమిటని అడిగితే చెక్ పవర్ కట్ చేస్తామన్నారు’ అంటూ ఓ రైతు స్పందనలో టీడీపీ నేతల సహకారంతో సోమవారం ఫిర్యాదు చేశారు.

వాటర్ షెడ్ పనులపై కలెక్టర్కు ఫిర్యాదు
మెంటాడ, ఫిబ్రవరి 6: ‘వాటర్ షెడ్ నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చారు. దీంతో ఐదు రోజులు దగ్గరుండి పని చేయించాను. అంతలో వైసీపీ నేతల నుంచి పైరవీలు మొదలయ్యాయి. పని ఆపేసివైసీపీ నేతలకు అప్పగించారు. ఇదేమిటని అడిగితే చెక్ పవర్ కట్ చేస్తామన్నారు’ అంటూ ఓ రైతు స్పందనలో టీడీపీ నేతల సహకారంతో సోమవారం ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే
మైక్రో వాటర్ షెడ్ పనులు బుచ్చిరాజుపేట పంచాయితీకి ఇటీవల మంజూరయ్యాయి. సుమారు రూ.8 లక్షలు కేటాయించారు. సర్పంచ్ తాడ్డి తిరుపతి, కమిటీ సభ్యులు కలిసి కొద్ది రోజుల క్రితం వెన్నెపూరివాని చెరువు వద్ద పనులు ప్రారంభించారు. ఐదు రోజులు పనిచేసి సుమారు 250 మీటర్లలో మట్టిగోడ నిర్మించారు. ఇంతలో వైసీపీ నేతల పైరవీలు ప్రారంభించారు. అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అంతే పనులు ఆపేయాలని జేఈ వినోద్ ఆదేశించారు. కాదని పని చేస్తే బిల్లుతో తనకు సంబంధం లేదని తెగేసి చెప్పారని నేతలు చలుమూరి వెంకటరావు, గెద్ద అన్నవరంతో కలిసి సర్పంచ్ సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జేఈని వివరణ కోరగా సర్పంచ్ అధక్షతన పని ప్రారంభించామన్నారు. మధ్యలో పని నిలిపేయాలని ఉన్నతాధికారులు చెప్పారని, వారి ఆదేసానుసారం నడుచుకుంటున్నానని తెలిపారు.