నిర్విరామంగా 12 గంటల నడక
ABN , First Publish Date - 2023-08-22T03:01:18+05:30 IST
పాదయాత్రను నాయకులు సాధారణంగా రోజూ ఉదయం ప్రారంభించి రాత్రి విడిది కేంద్రంలో బస చేస్తారు.
లోకేశ్ సరికొత్త రికార్డు
యువగళం పాదయాత్రలో అరుదైన ఘట్టం
ఆదివారం మధ్యాహ్నం 3.40 గంటల నుంచి
సోమవారం తెల్లవారుజాము 4 వరకూ యాత్ర
వర్షం కురుస్తున్నా యువనేత ముందుకు
బెజవాడ శివారులో అడుగడుగునా నీరాజనం
విజయవాడ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): పాదయాత్రను నాయకులు సాధారణంగా రోజూ ఉదయం ప్రారంభించి రాత్రి విడిది కేంద్రంలో బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం మళ్లీ మొదలుపెడతారు. అయితే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఓ వైపు భుజం నొప్పి బాధపెడుతున్నా.. నిరంతర నడకతో కాళ్లు పట్టేసినా.. కేలండర్లో తేదీ మారినా నిర్విరామంగా 12 గంటలు పాదయాత్ర చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3.40 గంటల ప్రాంతంలో విజయవాడ ఏ కన్వెన్షన్ నుంచి ప్రారంభించిన పాదయాత్రకు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు నిడమనూరు వద్ద విరామమిచ్చి అక్కడే బస చేశారు. తన కోసం వేచి ఉన్న మహిళలు, చిన్నారులను ఆప్యాయంగా పలుకరిస్తూ, వారితో ఫొటోలు దిగుతూ పాదయాత్ర చేశారు. యువగళం పాదయాత్రలో 189వ రోజు ఈ ఘట్టం చోటు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం లోకేశ్ పాదయాత్ర విజయవాడ ఏ కన్వెన్షన్ నుంచి నిడమనూరు వరకు 16 కిలోమీటర్లు జరగాలి. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి అడుగడుగునా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి నీరాజనాలు పట్టడంతో చాలా నెమ్మదిగా ముందుకు సాగింది. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి లోకేశ్తో ఫొటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. యాత్ర సుదీర్ఘంగా సాగుతుండటంతో పాటు కరచాలనాలతో చేతులు నిండా గాట్లు ఏర్పడి ఇబ్బంది పెడుతున్నా లోకేశ్ చిరునవ్వుతో ముందుకుసాగారు. పోరంకి ప్రాంతానికి యాత్ర చేరుకునే సమయానికి జోరున వర్షం పడినా వర్షంలోనే యాత్ర కొనసాగించారు. తెల్లవారుజామున 4 గంటలకు పాదయాత్ర ముగించారు.