Share News

జిల్లా అభివృద్ధిలో 2023 కీలకం: కలెక్టర్‌

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:27 AM

సమగ్రమైన జిల్లాగా రూపాంతరం చెందడానికి 2023 సంవత్సరం బాగా సహకరించిందని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు.

 జిల్లా అభివృద్ధిలో 2023 కీలకం: కలెక్టర్‌

పార్వతీపురం (ఆంధ్రజ్యోతి): సమగ్రమైన జిల్లాగా రూపాంతరం చెందడానికి 2023 సంవత్సరం బాగా సహకరించిందని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. 2024 నూతన ఏడాది కూడా జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ... ఈ ఏడాది ఇప్పటివరకు 1.08 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో పేదలకు 27,142 గృహాలు మంజూరు కాగా దాదాపు 12,500 ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. పీఎంఏవై గ్రామీణ కింద మరో వెయ్యి గృహాలు పూర్తి అయ్యాయన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కింద రూ.44.73 కోట్లతో పనులు మంజూరు చేశామన్నారు. 125 గ్రామ సచివాలయాలు, వంద ఆర్‌బీకేల భవనాల నిర్మాణం పూర్తి చేశామన్నారు. రూ.1259 కోట్లతో రోడ్లు మంజూరు చేశామన్నారు. దీనికి అదనంగా ఉపాధి హామీ పథకం కింద ప్రతి గిరిజన మండలానికి రూ.3కోట్ల చొప్పున రూ.39 కోట్లు మంజూరైందని తెలిపారు. 37 పీహెచ్‌సీల్లో సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించామన్నారు. జిల్లాలో మాతృ, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గించామని, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నామని చెప్పారు. ఉద్యాన కళాశాల వద్ద వైద్య కళాశాల నిర్మాణానికి మట్టి పరీక్షలు జరిగాయని, డిజైన్‌ తుది రూపంలో ఉందని తెలిపారు. కురుపాం, భద్రగిరి, సీతంపేట సామాజిక ఆసుపత్రుల ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని, సీతంపేటలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు ఇంకా 20 శాతం మిగిలి ఉందని స్పష్టం చేశారు. పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వేగవంతంగా జరుగుతుందన్నారు. ప్రజా ప్రతినిఽధులు, అధికారులు, సిబ్బంది సహకారంతో 2023లో విద్య, వైద్య, మౌలి సదుపాయాలు, వ్యవసాయం తదితర రంగాల్లో గణనీయ ప్రగతి సాధించామని తెలిపారు.

Updated Date - Dec 31 , 2023 | 12:27 AM