శ్రమించారు.. సాధించారు..
ABN , First Publish Date - 2023-04-03T00:51:46+05:30 IST
నర్సీపట్నం మునిసిపాలిటీలో 2022-23 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో అయ్యాయి.
ఐక్యంగా ముందుకు సాగిన సిబ్బంది
మొండి బకాయిలూ క్లియర్
నర్సీపట్నం, ఏప్రిల్ 2 : ఇక్కడి మునిసిపాలిటీలో 2022-23 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో అయ్యాయి. ఆస్తి పన్ను వడ్డీ రాయితీ ప్రకటించడంతో మొండి బకాయిలన్నీ వసూళ్లు జరిగాయి. కోర్టు కేసులలో ఉన్న పన్నులు కూడా చెల్లించి వడ్డీ రాయితీ పొందారు. దీంతో ఎన్నడూ లేని విధంగా 95.1 శాతం ఆస్తి పన్నులు కావడం విశేషం. మునిసిపాలిటీలో 13,835 మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. ఇం దులో ప్రైవేటు అసెస్మెంట్లు 13,759 కాగా, ప్రభుత్వ భవనాలు 76 ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు కలిసి పన్నులు వసూలు చేయాల్సింది. రూ.7.37 కోట్లు లక్ష్యం కాగా రూ.6.04 కోట్లు వసూళ్లు అయింది.
ప్రైవేటు ఆస్తి పన్నులు డిమాండ్ రూ.5.65 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ.5.37 కోట్లు అంటే 95.1 శాతం వసూళ్లు జరిగాయి. పన్ను రాయితీ పథకం కారణంగా మొండి బకాయిలు చాలా వరకు వసూళ్లు అయినట్టు మునిసిపల్ అధికారులు తెలిపారు. 3,537 మంది బకాయిదారుల్లో ఇద్దరు మినహా, మిగిలిన ఆస్తి పన్నుదారులు పాత బకాయిలు చెల్లించి వడ్డీ రాయితీ పొందారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు గత ఏడాది కంటే 6.7 శాతం పన్నులు వసూలు చేస్తేనే 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరుకు అర్హత సాధించే అవకాశం ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్నులు రూ.5.39 కోట్లు వసూలు చేయగా, ఈ సంవత్సరం రూ.6.04 కోట్లు వసూళ్లు అయ్యాయి. గత ఏడాది కంటే ఈ సంవత్సరం రూ.65 లక్షలు అధికంగా 12.21 శాతం పన్నులు వసూలు చేశామని మునిసిపల్ కమిషనర్ ఎన్.కనకారావు తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరాకిని ఆస్తి పన్ను సంవత్సరం మొత్తం ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం రాయితీ పొందవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.