జీవీఎంసీకి జీ-20 నిధులు వచ్చేనా?

ABN , First Publish Date - 2023-03-31T01:20:09+05:30 IST

జీ-20 సన్నాహాక సదస్సు నేపథ్యంలో జీవీఎంసీ పరిధిలో చేపట్టిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జీవీఎంసీకి జీ-20 నిధులు వచ్చేనా?

విదేశీ ప్రతినిధులను ఆకట్టుకునేలా నగరాన్ని తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం

నిధులు ఇస్తామని హామీ

రూ.110 కోట్లకుపైగా ఖర్చు పెట్టిన నగర పాలక సంస్థ

ఇంతవరకూ రూపాయి ఇవ్వని వైనం

అధికారులు, కాంట్రాక్టర్లలో ఆందోళన

విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి):

జీ-20 సన్నాహాక సదస్సు నేపథ్యంలో జీవీఎంసీ పరిధిలో చేపట్టిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదస్సు కోసం జీవీఎంసీ ఆధ ్వర్యంలో సుమారు రూ.110 కోట్లు, ఏపీ గ్రీన్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మరో రూ.20 కోట్లు వరకూ అభివృద్ధి, సుందరీకరణ కోసం ఖర్చు చేశారు. జీ-20 సదస్సు రాష్ట్రానికి ప్రతిష్టాత్మకం కావడంతో విదేశీ ప్రతినిధులను ఆకట్టుకునే విధంగా నగరాన్ని తీర్చిదిద్దాలని జీవీఎంసీ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అందుకోసం అయ్యే ఖర్చును తామే భరిస్తామంటూ హామీ ఇచ్చింది. దీంతో జీవీఎంసీ అధికారులు వెనుకా ముందు ఆలోచించకుండా పెద్దఎత్తున రహదారులు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, మరమ్మతులు, సుందరీకరణ, పెయింటింగ్‌ పనులు చేపట్టారు. గ్రీన్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ల్యాండ్‌స్కేపింగ్‌, సెంటర్‌ మీడియన్లలో మొక్కలు నాటడం వంటి పనులు చేపట్టారు. ఈ నెల 28, 29 తేదీల్లో సదస్సు ముగిసింది. అయితే ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడంతో అధికారులతోపాటు కాంట్రాక్టర్లలో అనుమానాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో నిధులను విడుదల చేయడం అనుమానమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నిధులను జీవీఎంసీయే సర్దుబాటు చేయాల్సి వస్తుందేమోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నెలరోజులు కిందట రూ.35 కోట్లు విడుదలకు సంబంధించి జీవో జారీచేసి చేతులు దులిపేసుకుంది. మిగిలిన నిధుల సంగతి పక్కనపెడితే జీవోలో పేర్కొన్న ఆ రూ.35 కోట్లు కూడా ఇంతవరకూ జీవీఎంసీ ఖాతాకు జమ కాలేదు. జీవీఎంసీ సాధారణ నిధుల నుంచి తమకు బిల్లులు చెల్లించాలని, లేనిపక్షంలో న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2023-03-31T01:20:09+05:30 IST