ఎవరి కోసం ఈ వెలుగులు
ABN , First Publish Date - 2023-08-30T01:22:07+05:30 IST
నగరంలో కోట్లాది రూపాయలు వెచ్చించి అట్టహాసంగా నిర్మిస్తున్న మోడల్ బస్టాప్లు జీవీఎంసీకి పెనుభారంగా మారనున్నాయి.
మోడల్ బస్టాప్లలో విద్యుత్ దుబారా
తెల్లవార్లూ వెలుగుతున్న దీపాలు
ప్రజల దృష్టిని ఆకర్షించేలా భారీ లైటింగ్ ఏర్పాటు
సీఎం ఫొటో, నవరత్నాల లోగోతో గ్లోసం గ్లో సైన్ బోర్డులు
ప్రయాణికులు లేని, బస్ సర్వీసులు తిరగని సమయాల్లో ఎందుకనే ప్రశ్నలు
జీవీఎంసీపై విద్యుత్ చార్జీల రూపేణా అదనపు భారం
అధికార పార్టీకి ప్రచారం కోసమే...
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో కోట్లాది రూపాయలు వెచ్చించి అట్టహాసంగా నిర్మిస్తున్న మోడల్ బస్టాప్లు జీవీఎంసీకి పెనుభారంగా మారనున్నాయి. వాస్తవ వ్యయం కంటే భారీగా అంచనాలు పెంచి అధికార పార్టీ నేతలకు కావలసిన వ్యక్తికి నిర్మాణ బాధ్యతలు అప్పగించారనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. దానివల్ల జీవీఎంసీకి భారీగా నష్టం వాటిల్లనున్నది. ఇక ఈ మోడల్ బస్టాపులు రాత్రివేళ ప్రజల దృష్టిని ఆకర్షించేలా భారీగా లైటింగ్ ఏర్పాటుచేశారు. తెల్లవార్లు ఈ లైట్లు వెలుగుతుండడంతో జీవీఎంసీపై విద్యుత్ చార్జీల రూపంలో కూడా నెలనెలా భారం పడడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జీవీఎంసీ పరిధిలో రూ.4.62 కోట్లతో 20 మోడల్ బస్టాప్లను నిర్మిస్తున్నారు. ఒక్కో బస్టాప్లో ప్రయాణికులు కూర్చొనేందుకు గ్రానైట్తో అరుగులు, తాగునీరు, మరుగుదొడ్డి సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటికే ప్రారంభించిన బస్టాప్లలో ఎక్కడా మంచినీటి సరఫరా, మరుగుదొడ్డి వంటివేమీ లేవు. కానీ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి లబ్ధి కలిగించే ఉద్దేశంతో మోడల్ బస్టాపులపై గ్లోసం బోర్డుల మాదిరిగా సీఎం జగన్ ఫొటోతోపాటు నవరత్నాలకు సంబంధించిన సమాచారంతో లోగో తయారుచేసి ఏర్పాటుచేశారు. రాత్రివేళ కూడా ఆ లోగోతోపాటు బస్టాప్ పేరు స్పష్టంగా కనిపించేలా ప్రకాశవంతమైన ఎల్ఈడీ లైట్లను ఏర్పాటుచేశారు. బస్టాప్లో సీలింగ్కు ఎల్ఈడీ బల్బులు ఏర్పాటుచేశారు. రోడ్డున పోయేవారిని ఆకర్షించేలా బస్టాప్కు ఇరువైపులా పది అడుగులు ఎత్తుండే లైటింగ్ పోల్స్ను ఏర్పాటుచేశారు. దీంతో రాత్రివేళ మోడల్ బస్టాప్లు విద్యుత్ లైట్లతో ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ జీవీఎంసీకి చెందిన వీధిదీపాల సర్వీస్ నుంచి వీటికి విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు. ప్రయాణికులు లేని, అసలు బస్ సర్వీసులు ఉండని సమయాల్లో కూడా బస్టాపుల్లో లైట్లను ఆపడం లేదు. తెల్లవార్లు లైట్లు వెలుగుతూనే ఉంటున్నాయి. దీనివల్ల అనవసరంగా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఇరవై బస్టాపుల్లో రాత్రంతా భారీగా విద్యుత్ వినియోగం కారణంగా చార్జీల రూపంలో అదనపు భారం పడనున్నది. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని, రాత్రివేళ ప్రయాణికులు, బస్ సర్వీసులు లేని సమయాల్లో విద్యుత్ దీపాలు వెలుగుతూ ఉండాల్సిన అవసరం లేదని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.