యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టును అడ్డుకుంటాం

ABN , First Publish Date - 2023-02-09T01:03:25+05:30 IST

ఆదివాసీలకు నష్టం కలిగించే యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకుంటామని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర కాఫీ బోర్డు సభ్యుడు కురసా ఉమామహేశ్వరరావు తెలిపారు.

యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టును అడ్డుకుంటాం
మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు

బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు

చింతపల్లి, ఫిబ్రవరి 8: ఆదివాసీలకు నష్టం కలిగించే యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకుంటామని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర కాఫీ బోర్డు సభ్యుడు కురసా ఉమామహేశ్వరరావు తెలిపారు. బుధవారం చింతపల్లిలో పార్టీ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యర్రవరం పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టు(హైడ్రో పవర్‌ ప్రాజెక్టు) నిర్మాణంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధాలున్నట్టు ప్రచారం చేస్తున్నారని, ఇది వాస్తవం కాదన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందని, కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉన్నట్టు ఎవరైనా నిరూపించేందుకు ముందుకొస్తే బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నిర్వాసిత ప్రజలకు అండగా ఉంటూ ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకునేందుకు బీజేపీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా క్రిష్టారావు మాట్లాడుతూ గిరిజన ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఆమోదంతోనే హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణాలకు జగన్మోహన్‌రెడ్డి ముందడుగు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోనంగి బాలయ్యపడాల్‌, కదుళ్ల శ్రీను, మండలాధ్యక్షుడు సాగిన బాలకృష్ణ, పార్టీ సీనియర్‌ నాయకులు వసుపరి శ్రీనివాస్‌రావు, నేమవరపు త్రిమూర్తులు, వంటరి చిన్నారావు, ఇండిక శివ, పొటుకూరి శ్రీనుబాబు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-09T01:03:27+05:30 IST