ఆర్టీవో కార్యాలయానికి మూడెకరాల స్థలం
ABN , First Publish Date - 2023-05-27T00:30:58+05:30 IST
పట్టణంలోని ప్రాంతీయ రవాణా శాఖాధికారి కార్యాలయం సొంత భవన నిర్మాణానికి ప్రభుత్వం మూడు ఎకరాల స్థలం కేటాయించింది.
ప్రస్తుతం అద్దె భవనంలో ఇబ్బందుల నడుమ సిబ్బంది విధులు
నర్సీపట్నం, మే 26 : పట్టణంలోని ప్రాంతీయ రవాణా శాఖాధికారి కార్యాలయం సొంత భవన నిర్మాణానికి ప్రభుత్వం మూడు ఎకరాల స్థలం కేటాయించింది. ప్రస్తుతం బ్యాంక్ కాలనీలోని ఓ ప్రైవేటు భవనంలో ఆర్టీవో కార్యాలయం నిర్వహిస్తున్నారు. దీంతో సరైన వసతి, మౌలిక సదుపాయాలు లేక అధికారులు, వివిధ పనులపై వచ్చే ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీవో, ఎంవీఐ, అసిస్టెంట్ ఎంవీఐ, పరిపాలనాధికారికి గదులు సరిపోవడం లేదు. కంప్యూటర్ రూమ్ లేదు. అలాగే, డ్రైవింగ్ ట్రాక్ సౌకర్యం కొరవడింది. డ్రైవింగ్ లైసెన్స్కు దరఖాస్తు చేసుకున్నప్పుడు ముందుగా డ్రైవింగ్ టెస్ట్ పెడతారు. దీనికోసం ప్రత్యేంగా డ్రైవింగ్ ట్రాక్ అవసరం. వాహనాలు బ్రేక్ చేయించు కోవడానికి వచ్చినప్పుడు వాటిని పార్కింగ్ చేసుకోవడానికి అవసరమైన స్థలం లేదు. దీంతో ఆర్టీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రైవేటు ఖాళీ స్థలాలను వాడుకుంటున్నారు. తాజాగా బలిఘట్టం బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలో మూడెకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆర్టీవో కార్యాలయ భవన నిర్మాణానికి కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డారు.
జిల్లా పునర్విభజన తర్వాత అప్గ్రేడ్
ఇదిలావుంటే, మొన్నటి వరకు నర్సీపట్నంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఉండేది. ఇక్కడ ఎల్ఎల్ఆర్లు, లైసెన్స్, ఫిట్నెస్ సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. వాహనాల మార్పులు, రిజిస్ట్రేన్ కోసం అనకాపల్లి ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. జిల్లా పునర్విభజన తర్వాత నర్సీపట్నంలోని ఎంవీఐ కార్యాలయాన్ని రీజనల్ ట్రాన్స్పోర్టు కార్యాలయంగా అప్గ్రేడ్ చేశారు.
కార్యాలయం పరిధిలో 12 మండలాలు
ఈ కార్యాలయం పరిధిలో 12 మండలాలు ఉన్నాయి. ఆర్టీవో పోస్టు ఇంకా భర్తీ చేయలేదు. ప్రస్తుతం ఎంవీఐ, సహాయఎంవీఐ, ఏవో ఉన్నారు. పూర్తిస్థాయిలో ఇక్కడ సేవలు అందుబాటులోకి వస్తే వాహనాల రిజిస్ట్రేషన్, ఆలే్ట్రషన్ పనుల కోసం అనకాపల్లి ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిన పని ఉండదు. కొత్తగా ఆఫీసు పెట్టడం వల్ల పూర్తి స్థాయిలో సేవలందుబాటులోకి రాలేదు. త్వరలోనే అన్ని రకాలు సేవలు నర్సీపట్నంలో అందుబాటులోకి వస్తాయని అధికారులు చెపుతున్నారు.