వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతిపాలు

ABN , First Publish Date - 2023-05-02T00:54:54+05:30 IST

వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, అన్ని రంగాల్లో వెనుకబడిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతిపాలు
ఎలమంచిలిలో జగనాసుర అవినీతిపై నిరసన ర్యాలీ చేస్తున్న టీడీపీ నేతలు

టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపణ

ఎలమంచిలిలో జగనాసుర అవినీతిపై నిరసన ర్యాలీ

ఎలమంచిలి, మే 1: వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, అన్ని రంగాల్లో వెనుకబడిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. ఎలమంచిలి పట్టణంలోని టీడీపీ ప్రాంతీయ కార్యాలయం వద్ద ప్రధాన రోడ్డుపై సోమవారం టీడీపీ నేతలు జగనాసుర అవినీతిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవించారని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ప్రజా వ్యతిరేక పాలన సాగించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసేలా పాలన సాగించి అభివృద్ధి కుంటుపడేలా చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గొర్లె నానాజీ, ఆడారి రమణబాబు, నాయకులు కొఠారు సాంబ, ఆడారి ఆదిమూర్తి, ఎంపీటీసీ నీరుకొండ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. కాగా టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రాంతీయ కార్యాలయం వద్ద సోమవారం భారీగా పోలీసులు మోహరించారు.

Updated Date - 2023-05-02T00:54:54+05:30 IST