నిరసనల జోరు
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:00 AM
జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల ఆందోళన కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారు చేపట్టిన సమ్మె సోమవారానికి 14వ రోజుకు చేరుకుంది. కశింకోట ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం సమీపంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఉయ్యాలలో చిన్నారిని వేసి జోలపాడుతూ అంగన్వాడీలు నిరసన తెలిపారు.
14వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె
వివిధ రూపాల్లో నిరసన
నర్సీపట్నంలో ఎన్టీఆర్ మినీ స్టేడియం వద్ద క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న కార్యకర్తలు
కుటుంబ సభ్యులతో పండగ చేసుకోలేకపోయామని ఆవేదన
ఆంధ్రజ్యోతి- అనకాపల్లి, న్యూస్ నెట్వర్క్)
జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల ఆందోళన కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారు చేపట్టిన సమ్మె సోమవారానికి 14వ రోజుకు చేరుకుంది. కశింకోట ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం సమీపంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఉయ్యాలలో చిన్నారిని వేసి జోలపాడుతూ అంగన్వాడీలు నిరసన తెలిపారు. పరవాడలో తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్షా శిబిరంలో తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై మండిపడ్డారు. రావికమతంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదురుగా బీఎన్ రోడ్డును ఆనుకోని అంగన్వాడీలు దీక్ష కొనసాగిస్తున్నారు. దేవరాపల్లిలో దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీలు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సీఎం జగన్ చిత్రపటానికి తినిపించారు. నర్సీపట్నంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రార్థనలు చేశారు. కుటుంబ సభ్యులతో క్రిస్మస్ పండగ జరుపుకోవాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రోడ్డు మీదకు రావలసి వచ్చిందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. మునగపాకలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. సోమవారం వీరి దీక్షా శిబిరానికి టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు వచ్చి సంఘీభావం తెలిపారు. రాంబిల్లిలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది.