చేనేత చీర నడక అదరహో
ABN , First Publish Date - 2023-08-07T00:30:57+05:30 IST
నగరంలోని సాగర తీరంలో ఆదివారం ఉదయం నిర్వహించిన చేనేత చీర నడక కార్యక్ర మం అదరహో అనిపించింది. యువతులకు చీర కట్టు గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటు చేనేత వస్ర్తాలను ప్రోత్సహించడం, నడక వల్ల కలిగే ఆరోగ్యంపై అవగాహన కలిగించే ఉద్దేశంతో బీచ్ రోడ్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బీచ్ రోడ్డు, ఆగస్గు 6 : నగరంలోని సాగర తీరంలో ఆదివారం ఉదయం నిర్వహించిన చేనేత చీర నడక కార్యక్ర మం అదరహో అనిపించింది. యువతులకు చీర కట్టు గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటు చేనేత వస్ర్తాలను ప్రోత్సహించడం, నడక వల్ల కలిగే ఆరోగ్యంపై అవగాహన కలిగించే ఉద్దేశంతో బీచ్ రోడ్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సుమారు పది వేల మంది మహిళలు చీర కట్టుకుని పాల్గొన్నారు. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కంచి కామాక్షీ సిల్క్స్ సహకారం అందించింది. ముఖ్య అతిథులుగా భారత్ ఒలింపిక్ విజేత, ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పద్మశ్రీ కరణం మల్లీశ్వరి, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి హాజరు కాగా, విశిష్ట అతిథిగా సీఎంఆర్ సంస్థల డైరక్టర్ మావూరి మానస హాజరై జెండా ఊపి నడకను ప్రారంభించారు. విశ్వప్రియ ఫంక్షన్ హల్ నుంచి మూడు కిలోమీటర్ల మేర నడక నిర్వహించారు. ఈ సందర్భంగా కరణం మల్లీశ్వరి మాట్లాడుతూ చేనేత రంగాన్ని ప్రోత్స హించడంతో పాటు చీర ధరించే సాంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఆరో గ్యాన్ని కాపాడుకోవడంలో నడక ఎంతో కీలకమని, ఇంటి సంరక్షణలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండా లంటే మహిళలు తప్పనిసరిగా నడవాలన్నారు. మేయర్ గొలగాని హరి వెంకటకుమారి మాట్లాడుతూ యువతలు చీర కట్టును అలవాటు చేసుకోవాలన్నారు. సీఎంఆర్ సంస్థల డైరక్టర్ మావూరి మానస మాట్లాడుతూ చేనేత చీర నడకకు మంచి స్పందన వచ్చిందన్నారు. కంచి కామాక్షీ సీల్క్స్ షోరూమ్లో విక్రయించే ప్రతి చీర నేరుగా చేనేత కార్మికులు తయారు చేసినవేనని తెలిపారు. కాగా నగరంలో తొలిసారి ఈ తరహా నడకను నిర్వహించారు. సుమారు పది వేల మంది మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నగర పరి ధిలోని మహిళలే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముణులు కూడా చీర కట్టుకుని నడకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జుంబా డ్యాన్స్, కోలాటాలు, ప్రత్యేక చీర కట్టు పోటీలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ప్రెసిడెంట్ దొరబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుధా పద్మశ్రీ, తదితరులు పాల్గొన్నారు.