Share News

వైసీపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి

ABN , First Publish Date - 2023-11-22T00:16:42+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరైన నేపథ్యంలో మంగళవారం గాజువాకలోని పార్టీ కార్యాలయ ఆవరణలో ఆయన కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు.

వైసీపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి
టీడీపీ నాయకుడు నల్లూరు సూర్యనారాయణకు కేక్‌ తినిపిస్తున్న పల్లా శ్రీనివాసరావు

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

గాజువాక, నవంబరు 21: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరైన నేపథ్యంలో మంగళవారం గాజువాకలోని పార్టీ కార్యాలయ ఆవరణలో ఆయన కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని చంద్రబాబును కక్షపూరితంగా సీఎం జగన్‌ అరెస్టు చేయించారని మండిపడ్డారు. ఇప్పుడు చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వడం జగన్‌కు చెంపపెట్టని అన్నారు. వైసీపీ అంటే ఓ దుర్మార్గమని, అక్రమాలు, కక్షపూరిత రాజకీయాలకు వేదికగా నిలుస్తుందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌, కార్పొరేటర్‌ గంధం శ్రీనివాస్‌, నాయకులు నల్లూరు సూర్యనారాయణ, పులి వెంకట రమణారెడ్డి, అడుసుమల్లి దీప్తి, పప్పు శంకరరావు, అప్పారావు, గోమాడ వాసు, తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ పాలనలో కానరాని అభివృద్ధి

అగనంపూడి: వైసీపీ ప్రభుత్వ పాలనలో అప్పులే తప్పా అభివృద్ధి కానరావడం లేదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. 79వ వార్డు పరిధి అగనంపూడిలో మంగళవారం నిర్వహించిన బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి ఆయన ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం పథకాల పేరిట ప్రజలను మోసగిస్తుందని, ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని మోపుతుందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం ఆయన కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాస్‌, టీడీపీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ వెళ్లి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్రి దశేంద్ర, బొబ్బరి సూర్య, సత్యారావు, కె.జగదీశ్‌, సుబ్బరాజు, ఎస్‌.సింహాచలం, డి.రమేశ్‌, కనకభవానీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-22T00:16:45+05:30 IST