గ్రేటర్లో రాజధాని హైరానా
ABN , First Publish Date - 2023-09-22T01:19:46+05:30 IST
విజయదశమి తర్వాత విశాఖ నుంచి పరిపాలన ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారుల్లో హడావిడి మొదలైంది.
జీవీఎంసీలో హడావుడి
ఎండాడ, రుషికొండ ప్రాంతాల్లో ఒకేచోట 45 ఫ్లాట్లు కోసం అన్వేషణ
మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ ఉన్నతాధికారుల కోసమేనని ప్రచారం
మరోవైపు జీవీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని ముడసర్లోవలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవనంలోకి మారుస్తారని ప్రచారం
జీవీఎంసీ భవనం రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ విభాగానికి కేటాయింపు?
హుటాహుటిన విజయవాడ వెళ్లిన కమిషనర్
విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
విజయదశమి తర్వాత విశాఖ నుంచి పరిపాలన ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారుల్లో హడావిడి మొదలైంది. సీఎంతోపాటు కీలకమైన ఆరు శాఖలు విశాఖ వస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో ఒకేచోట 45 ఫ్లాట్లు కలిగి, కనీసం వంద కార్లు పార్కింగ్ చేసుకునే సదుపాయం కలిగిన భవనం కోసం వెతుకుతున్నట్టు తెలిసింది. కొత్తగా నిర్మిస్తున్న అపార్టుమెంట్లతోపాటు పలు విద్యా సంస్థలకు చెందిన భవనాలను కూడా దీనికోసం పరిశీలిస్తున్నట్టు సమాచారం. మరోవైపు జీవీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేసి తాత్కాలికంగా ముడసర్లోవలోని స్కిల్ డెవలప్మెంట్ భవనంలోకి తరలిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ జీవీఎంసీ భవనం ఖాళీ చేస్తే రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ విభాగానికి కేటాయించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదిలావుండగా గురువారం మధ్యాహ్నం జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్వర్మ హుటాహుటిన విజయవాడ బయలుదేరి వెళ్లడం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూర్చింది. మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ విభాగానికి సంబంధించిన పది మంది కీలమైన అధికారులతో శుక్రవారం విజయవాడలో ఉన్నతాధికారులు సమావేశం ఏర్పాటుచేశారని, అందుకోసమే కమిషనర్ వెళ్లారని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనా రాజధాని తరలింపు ప్రకటన నేపథ్యంలో జీవీఎంసీలో కొంతమంది అధికారులు హడావుడిగా కలియతిరుగుతుండడం, ఏ విషయం బయటకు చెప్పకపోవడాన్ని బట్టి మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ సీఎంతోపాటే తరలివస్తుందనే ప్రచారం పెద్దఎత్తున జరుగుతోంది.