గోస్తనీలో విద్యార్థి గల్లంతు
ABN , First Publish Date - 2023-12-11T01:11:58+05:30 IST
నదిలో స్నానం చేసేందుకు దిగిన విద్యార్థుల్లో ఒకరు గల్లంతయ్యారు.
స్నేహితులతో కలిసి స్నానానికి దిగి కొట్టుకుపోయిన వైనం
గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
పద్మనాభం, డిసెంబరు 10:
నదిలో స్నానం చేసేందుకు దిగిన విద్యార్థుల్లో ఒకరు గల్లంతయ్యారు. ఈ సంఘటన పద్మనాభం మండలం పాండ్రంగి కుర్రపల్లి గ్రోయిన్ వద్ద ఆదివారం జరిగింది. సీఐ సన్యాసినాయుడు తెలిపిన వివరాల మేరకు మధురవాడ గాయత్రీనగర్కు చెందిన పి.హరి (16) అదే ప్రాంతానికి చెందిన మరో 12 మంది స్నేహితులతో కలిసి ఆదివారం కుర్రపల్లి గ్రోయిన్ వద్దకు వచ్చారు. మొత్తం 13 మంది స్నానం చేసేందుకు ఉపక్రమించి నీటిలో దిగారు. స్నానం చేస్తూ హరి వారి నుంచి కొంత దూరం ముందుకు వెళ్లాడు. అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో గల్లంతయ్యాడు. మిగిలిన విద్యార్థులు కేకలు వేస్తుండగానే ప్రవాహానికి లోతట్టు ప్రాంతానికి కొట్టుకుపోయాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐ సురేష్ ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి పడే వరకు విద్యార్థి ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం మళ్లీ గాలిస్తామని సీఐ పేర్కొన్నారు. గల్లంతైన హరి నగరంలోని కృష్ణా కళాశాలలో ఇంటర్ ప్రఽథమ సంవత్సరం చదువుతున్నాడు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోలీసులు కేసు నమోదు చేశారు.