‘పేట వైసీపీలో లుకలుకలు!
ABN , First Publish Date - 2023-02-04T01:15:57+05:30 IST
అధికార వైసీపీలో రెండు వర్గాల మధ్య నెలకొన్న అధిపత్యపోరు శుక్రవారం జరిగిన మండల ప్రజా పరిషత్ వైస్ ఎంపీపీ-2 ఎన్నిక సందర్భంగా మరోసారి బయటపడింది. మండలానికి చెందిన జిల్లాస్థాయి నేత ఒకరు తన వర్గానికి చెందిన వ్యక్తిని వైస్ ఎంపీపీని చేయడానికి ఎమ్మెల్యే చేత బి.ఫారం ఇప్పించారు. కానీ సదరు ఎమ్మెల్యే విప్ జారీ చేయలేదు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు తెరవెనుక రాజకీయం నడిపారు.
‘చిక్కాల’ వర్గీయుడికి బి.ఫారం ఇచ్చిన ఎమ్మెల్యే
మెజారిటీ సభ్యులు కినుక
తమలో నుంచి ఒకరిని పోటీకి దింపాలని నిర్ణయం
విషయం పసిగట్టి ‘ఎన్నిక’ సమావేశానికి చిక్కాల వర్గీయులు గైర్హాజరు
ఎస్.నర్సాపురం సభ్యుడొక్కరే నామినేషన్ దాఖలు
పల్లెల మణికంఠస్వామి ఏకగ్రీవంగా ఎన్నిక
పాయకరావుపేట, ఫిబ్రవరి 3: అధికార వైసీపీలో రెండు వర్గాల మధ్య నెలకొన్న అధిపత్యపోరు శుక్రవారం జరిగిన మండల ప్రజా పరిషత్ వైస్ ఎంపీపీ-2 ఎన్నిక సందర్భంగా మరోసారి బయటపడింది. మండలానికి చెందిన జిల్లాస్థాయి నేత ఒకరు తన వర్గానికి చెందిన వ్యక్తిని వైస్ ఎంపీపీని చేయడానికి ఎమ్మెల్యే చేత బి.ఫారం ఇప్పించారు. కానీ సదరు ఎమ్మెల్యే విప్ జారీ చేయలేదు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు తెరవెనుక రాజకీయం నడిపారు. తమలో ఒకరిని ఎంపీపీగా పోటీచేయించాలని నిర్ణయించారు. ఈ విషయం ప్రత్యర్థి వర్గానికి తెలియడంతో వారు సమావేశానికి హాజరు కాలేదు. బి.ఫారం పొందిన సభ్యుడు వైస్ ఎంపీపీ-2 పదవికి నామినేషన్ వేయలేదు. దీంతో నాటకీయ పరిణామాల మధ్య ఎమ్మెల్యే మద్దతుదారుడు వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైస్ ఎంపీపీ-2గా గెలిచిన వెంకటనగరం ఎంపీటీసీ సభ్యుడు కోడ నల్లయ్య కొంతకాలం తరువాత రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో ఖాళీ అయిన వైస్ ఎంపీపీ-2 పదవికి శుక్రవారం ఎన్నికల అధికారి సీహెచ్.లచ్చన్న ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. మొత్తం 27 మంది సభ్యులకుగాను నల్లయ్య మృతితో 26 మంది వున్నారు. వీరిలో 16 మంది వైసీపీ, ఏడుగురు టీడీపీ, ఒకరు జనసేన, ఇద్దరు స్వతంత్రులు. కాగా వైస్ ఎంపీపీ-2 పదవికి తన మద్దతుదారుడైన గోపాలపట్నం ఎంపీటీసీ సభ్యుడు కె.సతీశ్రాజుకు అవకాశం ఇవ్వాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు కోరిన మీద ఎమ్మెల్యే బాబూరావు ఆయన పేరుతో ఆయన బి.ఫారం ఇచ్చినట్టు తెలిసింది. కానీ విప్ జారీ చేయలేదు. కాగా సతీశ్రాజు ఎంపికపై అధికార పార్టీకి చెందిన మెజారిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. విప్ జారీ చేయలేదు కాబట్టి తమలో ఒకరు వైస్ ఎంపీపీ-2గా పోటీ చేయాలని నిర్ణయించుకుని ఎస్.నర్సాపురం ఎంపీటీసీ సభ్యుడు పల్లెల మణికంఠస్వామి పేరును తెరపైకి తెచ్చారు. ఈ విషయం చిక్కాల వర్గీయులకు తెలిసింది. 16 మంది సభ్యుల్లో 11 మంది వ్యతిరేక శిబిరంలో వుండడంతో చిక్కాల వర్గానికి చెందిన నలుగురు ఎన్నికలకు హాజరు కాలేదు. వైసీపీకి చెందిన 16 మందిలో 12 మంది (సతీశ్రాజుతో కలిపి), టీడీపీకి చెందిన ఏడుగురిలో ముగ్గురు, జనసేన ఒకరు, ఇండిపెండెంట్లు ఇద్దరు కలిపి మొత్తం 18 మంది హాజరయ్యారు. అనంతరం ఎన్నికల అధికారి లచ్చన్న ఎన్నికల ప్రక్రియ చేపట్టగా ఎస్.నర్సాపురం సభ్యుడు పల్లెల మణికంఠస్వామి నామినేషన్ వేశారు. సతీశ్రాజు బి.ఫారం పొందినప్పటికీ తనకు తగిన మద్దతు లేదని భావించి నామినేషన్ వేయలేదు. దీంతో మణికంఠస్వామి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు లచ్చన్న ప్రకటించి ధ్రువపత్రాన్ని అందజేశారు. అనంతరం మణికంఠస్వామిని ఎంపీపీ ఇసరపు పార్వతి, ఎంపీడీఓ ఎఎ.సాంబశివరావు, వైసీపీ మండల అధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు, నాయకులు దేవవరపు సూర్యచక్రం, గూటూరు శ్రీనివాసరావు, ఇసరపు తాతారావు, తదితరులు సత్కరించారు.