జగన్‌రెడ్డి పాలనలో న్యాయానికి సంకెళ్లు

ABN , First Publish Date - 2023-09-20T01:33:35+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును అక్రమ అరెస్టు చేశారని, రాష్ట్రంలో హింసామార్గం నడుస్తుందని దీనిని రూపుమాపాలంటూ మంగళవారం టీడీపీ నాయకులు ఇక్కడి ఎన్టీఆర్‌ మార్కెట్‌యార్డులో మహాత్ముని విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

జగన్‌రెడ్డి పాలనలో న్యాయానికి సంకెళ్లు
ఎలమంచిలిలోని టీడీపీ నిరశన దీక్షా శిబిరంలో చంద్రబాబునాయుడు పేరిట నాయకులు పూజలు

చంద్రబాబునాయుడిది అక్రమ అరెస్టు అంటూ టీడీపీ నాయకులు ఆగ్రహం

వివిధ రూపాల్లో.. పలు ప్రాంతాల్లో ఆందోళనలు

అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 19 : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును అక్రమ అరెస్టు చేశారని, రాష్ట్రంలో హింసామార్గం నడుస్తుందని దీనిని రూపుమాపాలంటూ మంగళవారం టీడీపీ నాయకులు ఇక్కడి ఎన్టీఆర్‌ మార్కెట్‌యార్డులో మహాత్ముని విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డేడ మురళీ మాట్లాడుతూ జగన్‌రెడ్డి పాలనలో న్యాయానికి సంకెళ్లు వేస్తున్నారని ఆరోపించారు. మానవ హక్కుల ఉల్లంఘన, రాజ్యాంగ విలువలకు తూట్లు పొడవడం, ప్రజాసమస్యలను ప్రశ్నిస్తుంటే పోలీసులు గొంతునొక్కి అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు వంటివి జగన్‌రెడ్డి పాలనలోనే చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మళ్ల గణేష్‌, పొలిమేర నాయుడు, కర్రి మల్లేశ్వరరావు, బుద్ద భువనేశ్వరరావు, దాడి భోగలింగం తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా స్థానిక గవరపాలెంలోని పరమేశ్వరి పార్కు జంక్షన్‌లో గల అభయాంజనేయస్వామికి చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని , మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ తెలుగుదేశంపార్టీ బీసీ సాధికార సమితి కన్వీనర్‌ మళ్ల సురేంద్ర పూజలు నిర్వహించారు.

అనకాపల్లి రూరల్‌ : కుట్రలు, కుతంత్రాల నుంచి చంద్రబాబునాయుడు క్షేమంగా ఇంటికి చేరాలంటూ ఇక్కడి టీడీపీ నాయకులు మంగళవారం సింహాచలం పుణ్యక్షేత్రానికి తరలివెళ్లారు. మండలానికి చెందిన కొంతమంది టీడీపీ యువకులు సింహాచలంలో 101 మెట్లు మోకాళ్లతో ఎక్కి చంద్రబాబునాయుడుకు బెయిల్‌ రావాలని ప్రత్యేక పూజలు చేశారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబుకు ఎటువంటి అవినీతి మరక లేదని, సీఎం జగన్మోహన్‌రెడ్డి కక్షపూరితంగా జైలుకు పంపించారని ఆరోపించారు. ఈ సందర్భంగా స్వామివారిని పూజించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలారి కాశీనాయుడు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

నక్కపల్లి : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ నాయకులు మంగళవారం ఢిల్లీలో ప్లకార్డులు చేతబట్టి నిరసన ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌, మాజీ ఎంపీ మురళీమోహన్‌ తదితరులను కలిశారు. ముందుగా ఢిల్లీలోని పూజ్య బాపూజీ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు తదితరులతో పలువురు కేంద్ర పెద్దలను కలిశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఏజెర్ల వినోద్‌రాజు, లాలం కాశీనాయుడు, కొప్పిశెట్టి బుజ్జి, గుర్రం రామకృష్ణ, సీహెచ్‌. పద్దు, చిక్కాల శ్రీను, గోసల శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

లంకెలపాలెం : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి, అన్యాయంగా జైలుకు పంపిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. జీవీఎంసీ 79వ వార్డు పరిధి లంకెలపాలెంలో వార్డు కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ శ్రేణులు మంగళవారం చేపట్టిన సామూహిక నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. సైకో జగన్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. కార్పొరేటర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కడిగిన ముత్యంగా చంద్రబాబు బయటకు వస్తారన్నారు. టీడీపీ నాయకులు కరణం సత్యారావు, మచ్చా శివకుమార్‌, బొబ్బరి సూర్య, సుబ్బరాజు, కనక భవానీ, రౌతు మూర్తి, అర్జున్‌, బొండా రమణ, గుర్రం నాయుడు, శ్రీను పాల్గొన్నారు.

పాయకరావుపేట : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మంగళవారం పాయకరావుపేటలో టీడీపీ శ్రేణులు, బాలకృష్ణ అభిమానులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఇక్కడి టీడీపీ కార్యాలయం ఎదుట నియోజకవర్గ నందమూరి కల్చరల్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలుత ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మండల టీడీపీ అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, బాలకృష్ణ అభిమానులు నల్లబాడ్జీలు, కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు పెదిరెడ్డి శ్రీను, నందమూరి కల్చరల్‌ యూత్‌ గౌరవాధ్యక్షుడు చింతకాయల రాంబాబు, అధ్యక్షులు చల్లకొండ రమేష్‌తోపాటు టీడీపీ నాయకులు యాళ్ళ వరహాలబాబు, బొంది కాశీవిశ్వనాథం, పల్లా విలియంకేరి, వేములపూడి అప్పారావు, గొర్ల లక్ష్మీనారాయణ, సీహెచ్‌.పేర్రాజు, భాస్కర్‌ చౌదరి, శ్రీరంగం ప్రవీణ్‌, వరహాలు, వీరభద్రరావు, బత్తిన గోవింద్‌, వర్మరాజు, నారపురెడ్డి ముసిలి, నాగం గంగ తదితరులు పాల్గొన్నారు.

రాంబిల్లి : వైసీపీ అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ధూళి రంగనాయకులు, టీడీపీ తెలుగు యువత మండల అధ్యక్షుడు ఎరిపల్లి అజయ్‌ అన్నారు. చంద్రబాబునాయుడు పేరిట సింహాచలంలో స్వామికి పూజలు చేసేందుకు మంగళవారం టీడీపీ నాయకులు బుద్ద నాగజగదీశ్వరరావు, బండారు సత్యనారాయణ, ప్రగడ నాగేశ్వరరావు తదితరులతో కలిసి వెళుతుండగా తమను స్వామి దర్శనం చేసుకోనివ్వకుండా పోలీసులు అడ్డుపడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎలమంచిలి : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఎలమంచిలిలో టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం ఏడో రోజుకు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొలుకులూరి విజయ్‌బాబులు శిబిరాన్ని సందర్శించి వైసీపీ అరాచక పాలనను ఎండగట్టారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినందుకు సీఎం జగన్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పార్టీ నాయకులు రాజాన నారాయణమ్మ, రాజాన సూర్య నాగేశ్వరరావు, సర్పంచ్‌ ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, కొఠారు సాంబ, గొర్లె నానాజీ, రమణబాబు, మాజీ కౌన్సిలర్‌ బొద్దపు నాగేశ్వరరావు, కరణం రవి తదితరులు పాల్గొన్నారు.

మునగపాక : చంద్రబాబు అరెస్టుపై సింహాచలం గాలిగోపురం ముందు మునగపాక టీడీపీ నాయకులు మోకాళ్లపై నిలిచి నిరసన తెలిపారు. సింహాచలం వరహా నృసింహస్వామిని వేడుకోవడానికి మునగపాక నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు మంగళవారం తరలివెళ్లారు. మెట్లు ఎక్కుతుండగా రాష్ట్ర తెలుగురైతు కార్యదర్శి దాడి ముసిలినాయుడు, బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమరశెట్టి శ్రీనివాసరావు, ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు పెంటకోట విజయ్‌ మరో పదిమంది నాయకులను అరెస్టు చేసి ఎయిర్‌పోర్ట్‌ వద్ద స్టేషన్‌కు తరలించారు. జిల్లా తెలుగుమహిళ అధ్యక్షురాలు ఆడారి మంజు, పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావు మరో పదిమంది పోలీసుల కంటపడకుండా గాలి గోపురం వద్దకు చేరుకుని మోకాళ్లపై నిరసన తెలిపారు.

ఎస్‌.రాయవరం : చంద్రబాబు క్షేమంగా ఇంటికి చేరాలని కోరుతూ మండలంలోని ధర్మవరం అగ్రహారంలో సోమవారం వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద ఎంపీటీసీ సభ్యురాలు సియ్యాదుల వరహాలమ్మ, ఆమె కుమారుడు అచ్యుత్‌కుమార్‌ ఆధ్వర్యంలో స్థానికులు 101 కొబ్బరికాయులు కొట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ అచ్యుత్‌కుమార్‌ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కలిగట్ల రత్నం, ఉప సర్పంచ్‌ మాణిక్యం, బండి నాగేశ్వరరావు, గేదెల నాయుడు, గోవింద్‌, వెంకటరమణ, సత్యనారాయణ, నాగేశ్వరరావు, చిననాగేశ్వరరావు, వరహాలరావు, సంజీవరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-20T01:33:35+05:30 IST