మొరాయిస్తున్న ఆర్టీసీ బస్సులు
ABN , First Publish Date - 2023-06-03T00:55:43+05:30 IST
మండలం మీదుగా రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులు సాంకేతిక సమస్యలతో తరచూ మొరాయిస్తుండడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సగటున వారం రోజులకు ఒక బస్సు ఏదో ఒక సమయంలో, ఎక్కడో ఒకచోట మరమ్మతులకు గురై ఆగిపోతున్నది. తాజాగా శుక్రవారం పాడేరు డిపోకు చెందిన ఏపీ 03 జడ్ 3204 నంబరుగల బస్సు పెదబయలు మీదుగా మారుమూల పంచాయతీ కేంద్రం బొంగరం వెళుతున్నది. మండల కేంద్రం నుంచి కొద్ది దూరం వెళ్లిన తరువాత సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.
ఎక్కడపడితే అక్కడ ఆగిపోతుండడంతో ప్రయాణికుల ఆగచాట్లు
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవాటిని నడపాలని వినతి
పెదబయలు, జూన్ 2: మండలం మీదుగా రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులు సాంకేతిక సమస్యలతో తరచూ మొరాయిస్తుండడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సగటున వారం రోజులకు ఒక బస్సు ఏదో ఒక సమయంలో, ఎక్కడో ఒకచోట మరమ్మతులకు గురై ఆగిపోతున్నది. తాజాగా శుక్రవారం పాడేరు డిపోకు చెందిన ఏపీ 03 జడ్ 3204 నంబరుగల బస్సు పెదబయలు మీదుగా మారుమూల పంచాయతీ కేంద్రం బొంగరం వెళుతున్నది. మండల కేంద్రం నుంచి కొద్ది దూరం వెళ్లిన తరువాత సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. డ్రైవర్ ఈ విషయాన్ని డిపో మేనేజర్కు ఫొన్ చేసి చెప్పారు. ప్రయాణికులను దించేసి, బస్సును డిపోకు తీసుకురావాలని డీఎం సూచించారు. మండల కేంద్రం నుంచి బొంగరం ప్రాంతానికి రోజుకు ఒక ట్రిప్పు మాత్రమే ఆర్టీసీ బస్సు నడుపుతున్నారు. శుక్రవారం బస్సుల ఆగిపోవడం, ప్రైవేటు వాహనాలు లేకపోవడంతో పలుగ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. ఇదిలావుండగా మండల కేంద్రం మీదుగా ముంచంగిపుట్టు, కుమడ, డుడుమ, జోలాపుట్టు పాంతాలకు నడుస్తున్న ఆర్టీసీ బస్సులు తరచూ మొరాయిస్తుండడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. డ్రైవర్, కండక్టర్ కూడా ఇబ్బంది పడుతున్నారు. డిపో నుంచి మెకానిక్ సిబ్బంది వచ్చి బాగు చేసే వరకు బస్సు వద్దనే వుండాల్సి వస్తున్నది. ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి పాడేరు డిపోలో కాలం చెల్లించిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని ఏజెన్సీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.