కిండలంలో మృత్యుఘోష!

ABN , First Publish Date - 2023-03-31T00:58:52+05:30 IST

పెదబయలు మండలం మారుమూల కుంతుర్ల పంచాయతీ పరిధి కిండలం గ్రామంలో మృత్యుఘోష కొనసాగుతుండడంతో స్థానిక గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడు వారాల్లో గ్రామానికి చెందిన ఏడుగురు మృతిచెందడంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇందుకు సంబంధించిన బాధిత కుటుంబీకులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు...

కిండలంలో మృత్యుఘోష!
విషాదంలో కొనబరి ఈశ్వరి కుటుంబ సభ్యులు

మూడు వారాల్లో ఏడుగురు గిరిజనులు మృతి

అంతుచిక్కని లక్షణాలతో ప్రాణాలు కోల్పోతున్న వైనం

వరుస మరణాలతో ఆందోళన చెందుతున్న ఆదివాసీలు

రెండు రోజుల క్రితం వైద్య శిబిరం ఏర్పాటు

అయినా ఆగని మరణాలు

పాడేరు/పెదబయలు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): పెదబయలు మండలం మారుమూల కుంతుర్ల పంచాయతీ పరిధి కిండలం గ్రామంలో మృత్యుఘోష కొనసాగుతుండడంతో స్థానిక గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడు వారాల్లో గ్రామానికి చెందిన ఏడుగురు మృతిచెందడంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇందుకు సంబంధించిన బాధిత కుటుంబీకులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు...

పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీలోని కిండలం గ్రామంలో వరుస మరణాలు చోటు చేసుకోవడంతో స్థానిక గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. కొనబరి ఈశ్వరి(35) అనే మహిళ కాళ్లు వంకర్ల తిరిగి ఈ నెల 29వ తేదీ రాత్రి మృతిచెందింది. అంతకుముందు రోజు వంచరంగి రామన్నదొర(42), కిముడు రామునాయుడు(60) పక్షవాతం లక్షణాలతో బాధపడుతూ చనిపోయారు. ఇక కిముడు కృష్ణంనాయుడు జ్వరం, వాంతులు, విరేచనాలతో ఈనెల 24న పాడేరు జిల్లా ఆస్పత్రి చేరగా, మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలిస్తుండగా దారిలోనే ప్రాణాలు వదిలాడు. అదే రోజు కిముడు బోడం నాయుడు(42) చింతచెట్టు నుంచి జారిపడి మృతిచెందాడు. ఈ నెల 12వ తేదీన కిముడు లక్ష్మినాయుడు తొమ్మిది నెలల కుమార్తె జ్వరంతో మృతి చెందగా, 11వ తేదీన కిముడు చిన్నమ్మి(60)అనే వృద్ధురాలు మృతి చెందింది. మూడు వారాల్లో వివిధ కారణాలతో గ్రామానికి చెందిన ఏడుగురు మృతిచెందడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న వైద్యసిబ్బంది మంగళవారం నుంచి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం కొనసాస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కిండలంలో మరణాలపై అధ్యయనం చేయించి, మరింత మంది మృత్యువాత పడకుండా చూడాలని గిరిజనులు కోరుతున్నారు.

అంత్యక్రియలకూ తప్పవని అవస్థలు

గ్రామంలో మృతిచెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సైతం కిండలం గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తుండడంతో మృతుల అంత్యక్రియాల్లో పాలుపంచుకునేందుకు పలువురు గ్రామస్థులు వెనుకంజ వేస్తున్నారు. మరోవైపు చుట్టుపక్కల గ్రామాల వారు కిండలం వైపు కన్నెత్తి అయినా చూడడం లేదు. ఇతర గ్రామాలకు చెందిన బంధువులు సైతం చుట్టం చూపుగా కూడా కిండలం రావడంలేదు.

Updated Date - 2023-03-31T00:58:52+05:30 IST