కేంద్ర ప్రభుత్వ తీరుపై 26న ఆందోళన
ABN , First Publish Date - 2023-01-18T00:24:42+05:30 IST
కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన చేపట్టనున్న ఆందోళనకు రైతులు సిద్ధం కావాలని రౌండ్టేబుల్ సమావేశంలో ప్రతినిధులు పిలుపునిచ్చారు.
అనకాపల్లి టౌన్, జనవరి 17 : కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన చేపట్టనున్న ఆందోళనకు రైతులు సిద్ధం కావాలని రౌండ్టేబుల్ సమావేశంలో ప్రతినిధులు పిలుపునిచ్చారు. పట్టణంలోని కార్మిక కర్షక నిలయంలో మంగళవారం వివిధ రాజకీయపక్షాలు, రైతు సంఘాల నాయకులతో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ అధ్యక్షతన సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను పోరాటం ద్వారా రద్దు చేయించిన చరిత్ర రైతు ఉద్యమానికి దక్కిందన్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు, వాటికి చట్టభద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును రైతు సంఘాలతో చర్చించకుండా పార్లమెంట్లో పెట్టబోనని ఇచ్చిన హామీని ప్రధాని తుంగలోకి తొక్కారని ఆరోపించారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను మోదీ అమలు చేయాలని, విద్యుత్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 26న చేపట్టనున్న రైతు రక్షణ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కర్రి అప్పారావు, వైఎన్ భద్రం, కోరిబిల్లి శంకరరావు, పీఎస్ అజయ్కుమార్, ఎం.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.