కొలిక్కిరాని రేషన్ డిపోల హేతుబద్ధీకరణ
ABN , First Publish Date - 2023-08-17T23:58:44+05:30 IST
జిల్లాలో రేషన్ డిపోల హేతుబద్ధీకరణ డీలర్ల మధ్య చిచ్చు రేపుతోంది. హేతుబద్ధీకరణకు కొందరు అనుకూలం కాగా మధురవాడ ప్రాంత డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. మధురవాడ ప్రాంత డీలర్లకు అనుకూలంగా వైసీపీ నేతలు రంగంలోకి దిగడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
మధురవాడ/వెంకోజీపాలెం, ఆగస్టు 17 : జిల్లాలో రేషన్ డిపోల హేతుబద్ధీకరణ డీలర్ల మధ్య చిచ్చు రేపుతోంది. హేతుబద్ధీకరణకు కొందరు అనుకూలం కాగా మధురవాడ ప్రాంత డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. మధురవాడ ప్రాంత డీలర్లకు అనుకూలంగా వైసీపీ నేతలు రంగంలోకి దిగడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు (ఎండీయూలు) హేతుబద్ధీకరించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. జిల్లాలో 311 ఎండీయాలకు కేటాయించిన కార్డులను పరిగణనలోకి తీసుకుని ప్రతి ఎండీయూకు సగటున 1600 నుంచి 1700 కార్డులు ఉండేలా హేతుబద్ధీకరించాలని జాబితా రూపొందించారు. అదే సమయంలో రేషన్ డిపోలను కూడా హేతుబద్ధీకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో 640 డిపోలను బియ్యంకార్డుల ప్రాతిపదికన తీసుకుని హేతుబద్ధీకరించాలని ప్రతిపాదించారు. ఉదాహరణకు నగరంలో ఒక డిపో పరిధిలో 600 కార్డులు ఉంటే మరికొన్ని డిపోల పరిధిలో 1500 వరకు ఉన్నాయి. అదే మధురవాడ పరిధిలో కొన్ని డిపోల్లో రెండు వేల వరకు కార్డులున్నాయి. కార్డులకు సంబంధించి డిపోల మధ్య వ్యత్యాసం లేకుండా చూడాలని ప్రతిపాదించారు. దీనివల్ల మధురవాడ నుంచి కొన్ని కార్డులు ఎండాడ, మారికవలసకు కేటాయించే అవకాశం ఉందని గుర్తించిన ఈ ప్రాంత చెకింగ్ ఇన్స్పెకర్లు అప్రమత్తమై డీలర్లకు సమాచారం అందించారన్న వాదన వినిపిస్తోంది. దీంతో మధురవాడ ప్రాంత డీలర్లు అధికార పార్టీ నాయకులను కలుసుకున్నారు. డిపోలు హేతుబద్ధీకరిస్తే తామంతా నష్టపోతామని చెప్పడంతో వైసీపీ నేతలు రంగంలోకి దిగి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చారని ప్రచారం సాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న నగరంలోని డీలర్లు, నేతలు రంగంలోకి దిగి డిపోలు హేతుబద్ధీకరించాలని కోరుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్ర, శనివారంలోగా ఎండీ యూలు, డిపోల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.