అంతటా ముసురు
ABN , First Publish Date - 2023-03-19T00:57:26+05:30 IST
జిల్లాలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో శనివారం పలుచోట్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం చల్లబడి, ముసురు వాతావరణం నెలకొంది.
జిల్లాలో పలు మండలాల్లో వర్షాలు
అనకాపల్లి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో శనివారం పలుచోట్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం చల్లబడి, ముసురు వాతావరణం నెలకొంది. జిల్లాలో శనివారం ఒక్కరోజే సగటున 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎక్కువగా గొలుగొండలో 66.25 మిల్లీమీటర్లు, నర్సీపట్నంలో 52.25, కశింకోట మండలంలో 21.5 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. పాయకరావుపేటలో ఒక మోస్తరు వర్షం కురిసింది. అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, సబ్బవరంలలో వర్షపు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. రబీ సీజన్కు సంబంధించి ముఖ్యంగా అపరాల పంటల సాగు చేపట్టిన రైతులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. జిల్లా వ్యవసాయాధికారి బి.మోహన్రావు మాట్లాడుతూ ప్రస్తుతానికి జిల్లాలో ఎటువంటి పంట నష్టం నమోదు కాలేదన్నారు. ఈ రబీ సీజన్లో జిల్లాలో 5,128 ఎకరాల్లో నువ్వు పంట సాగులో ఉందని, ప్రస్తుతం పూత దశలో ఉన్న ఈ పంటకు అకాల వర్షాలతో నష్టం జరిగే ప్రమాదం పొంచి వుందని తెలిపారు. వేరుశెనగ 1,090 ఎకరాలు, వరి 3 వేల ఎకరాలు, మొక్కజొన్న 135 ఎకరాల్లో, చోడి 45 ఎకరాలు, పొద్దుతిరుగుడు 75 ఎకరాలు సాగులో ఉందన్నారు. గొలుగొండ మండలం ఏఎల్పురం, కొంగశింగి, సీహెచ్.నాగాపురం, లింగంపేట, పాతకృష్ణాదేవిపేట తదితర గ్రామాల్లో మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం పడింది. కృష్ణాదేవిపేట పోలీస్స్టేషన్ ప్రహరీని ఆనుకుని భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. దీంతో ట్రాఫిక్కు కొంతసేపు అంతరాయం కలిగింది.