ఆకుమడులు తడుపుకోవడానికి నీరు అందించండి
ABN , First Publish Date - 2023-08-22T00:55:36+05:30 IST
ఆకుమడులు తడుపుకోవడానికి నీరు అందించాలని తాండవ, రావణాపల్లి రిజర్వాయర్లు పరిధిలోని ఆయకట్టు రైతులు స్పందనలో వినతిపత్రం ఇచ్చారు.
స్పందనలో రైతుల ఆర్జీలు
నర్సీపట్నం, ఆగస్టు 21 : ఆకుమడులు తడుపుకోవడానికి నీరు అందించాలని తాండవ, రావణాపల్లి రిజర్వాయర్లు పరిధిలోని ఆయకట్టు రైతులు స్పందనలో వినతిపత్రం ఇచ్చారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి సూర్యనారాయణ స్పందన ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తాండవ ఆయకట్టు రైతులు మాట్లాడుతూ తాండవ రిజర్వాయర్ నుంచి ఈ నెల 10న నీరు విడుదల చేసినప్పటికీ 10, 11 మేజర్లకు నీరు అందడం లేదని ఫిర్యాదు చేశారు. ఆకుమడులు ఎండి పోతున్నాయని వాటర్ ట్యాంకర్లతో తడుపుకోవల్సి వస్తున్నదని చెప్పారు. ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. రావాణాపల్లి రిజర్వాయర్ ఆయకట్టు రైతులు మాట్లాడుతూ గబ్బాడ కాలువ నుంచి కొత్తూరు నీలంపేట మదుం, రుత్తల రమణ ముదుం వరకు సొంత ఖర్చుతో పూడికతీత పనులు చేయించుకున్నామని తెలిపారు. పెద్ద మదుం నుంచి మడ్డు చంటిపాక మదుం వరకు లక్ష్మీపురం గ్రామస్థులు పూడిక తీసుకుంటుంటే జలవనరుల శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఈ నెల 15న నీరు విడుదల చేసినా ఇప్పటి వరకు నీరు అందలేదని ఆకుమడులు ఎండిపోతున్నాయని తెలిపారు. సాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటామని ఏవో సూర్యనారాయణ రైతులకు భరోసా కల్పించి జలవనరులశాఖ అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లాలం శ్రీరంగస్వామి, రాజుమల్లు పలువురు రైతులు పాల్గొన్నారు.