ఈపీడీసీఎల్ సీఎండీగా పృథ్వీతేజ్
ABN , First Publish Date - 2023-04-08T01:01:19+05:30 IST
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) సీఎండీగా పృథ్వీతేజ్ ఇమ్మాడి నియమితులయ్యారు.
2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారి
స్వస్థలం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల
విశాఖపట్నం, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) సీఎండీగా పృథ్వీతేజ్ ఇమ్మాడి నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి చేసిన బదిలీలలో భాగంగా ప్రస్తుతం ఇంధన శాఖలో డిప్యూటీ సెక్రటరీగా అమరావతిలో పనిచేస్తున్న ఆయన్ను ఈపీడీసీఎల్ సీఎండీగా నియమించింది. 2018 బ్యాచ్కు చెందిన పృథ్వీరాజ్ మొదట కడపలో సబ్ కలెక్టర్గా 15 నెలలు పనిచేశారు. ఆ తరువాత ఇంధన శాఖలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు. ఈపీడీసీఎల్ సీఎండీ పోస్టు ఆయనకు మూడవది.
ఏలూరు జిల్లా (గతంలో పశ్చిమ గోదావరి) ద్వారకా తిరుమలకు చెందిన పృథ్వీతేజ్ ఆరో తరగతి వరకు సొంత మండలంలోను, ఏడు నుంచి పదో తరగతి వరకు గుడివాడలో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ గూడవల్లి శ్రీచైతన్యలో చదివి 2011లో ఐఐటీ ప్రవేశ పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించారు. ముంబై ఐఐటీలో ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తరువాత శాంసంగ్లో కోటి రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం రాగా దక్షిణ కొరియా వెళ్లి ఏడాది పనిచేశారు. సివిల్స్ రాయాలనే సంకల్పంతో అక్కడి నుంచి వచ్చి ఏ కోచింగ్ సెంటర్లో చేరకుండా సొంతంగానే ప్రిపేర్ అయ్యారు. తన 24వ ఏట సివిల్స్లో 24వ ర్యాంకు సాధించారు. తండ్రి శ్రీనివాసరావు బంగారు నగల వ్యాపారి. తల్లి గృహిణి.
ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు యత్నిస్తా
పృథ్వీతేజ్
విశాఖపట్నం కేంద్రంగా ఈపీడీసీఎల్లో ఎంతోమంది పెద్దలు ఇప్పటివరకు సీఎండీలుగా పనిచేశారు. అటువంటి చోట పోస్టింగ్ రావడం ఎంతో సంతోషంగా ఉంది. దీనిని ఛాలెంజ్గా తీసుకొని ప్రజలకు మెరుగైన విద్యుత్ 24/7 అందించేందుకు యత్నిస్తా. ఈ వారంలోనే మంచిరోజు చూసుకొని విధుల్లో చేరతా.
తిరుపతికి సంతోషరావు
ప్రస్తుతం ఈపీడీసీఎల్ సీఎండీగా పనిచేస్తున్న కె.సంతోషరావు తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న ఎస్పీడీసీఎల్ సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పృథ్వీతేజ్ బాఽధ్యతలు చేపట్టగానే పూర్తి బాధ్యతలతో సీఎండీగా సంతోషరావు ఎస్పీడీసీఎల్లో పనిచేస్తారు.