నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కాగడాల ప్రదర్శన

ABN , First Publish Date - 2023-09-04T00:20:57+05:30 IST

నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సీపీఎం నాయకులు ఆదివారం రాత్రి కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు.

నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కాగడాల ప్రదర్శన
అనకాపల్లిలో కాగడాల ప్రదర్శన నిర్వహిస్తున్న సీపీఎం నేతలు

అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 3 : నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సీపీఎం నాయకులు ఆదివారం రాత్రి కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. రింగురోడ్డు నుంచి నెహ్రూచౌక్‌ వరకు ఈ ప్రదర్శన సాగింది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కె. లోకనాథం మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగాన్ని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. ప్రధానమంత్రి మోదీ 2014 ఎన్నికల్లో రెండు కోట్ల ఉద్యోగాలను ఏడాదిలో కల్పిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు ఉద్యోగావకాశాలు కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణమే నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, స్థానికులకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఈ ప్రదర్శనలో సీపీఎం నాయకులు ఆర్‌.శంకరరావు, గంటా శ్రీరామ్‌, అల్లు రాజు, ఎ.బాలకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T00:20:57+05:30 IST