పోర్టు చైర్మన్కు త్రుటిలో తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2023-03-26T01:41:49+05:30 IST
విశాఖపట్నం పోర్టు చైర్మన్ కె.రామమోహన్రావు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
నలుగురిపై చర్యలు?
విశాఖపట్నం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం పోర్టు చైర్మన్ కె.రామమోహన్రావు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం క్రితం ఆయన కార్యాలయం నుంచి కారులో బయటకు వస్తుండగా జనరల్ కార్గో బెర్తు సమీపాన మలుపులో రైలు ఇంజన్ ఢీకొట్టబోయింది. ప్రమాదం త్రుటిలో తప్పింది. సైడింగ్లో భాగంగా పోర్టులో రైలు ఇంజన్లు తిరగడం సహజమే. మలుపులు, వాహనాలు దాటే క్రాసింగ్ వద్ద హారన్ మోగిస్తారు. ఈ మలుపు దగ్గర కూడా డ్రైవర్ హారన్ మోగించారని చెబుతున్నారు. అయితే ఇంజన్ వచ్చేలోపు పట్టాలు దాటేయవచ్చుననే ధీమాతో కారును డ్రైవర్ను ముందుకు పోనిచ్చినట్టు సమాచారం. ఈ ఘటనతో తీవ్ర దిగ్ర్భాంతికి గురైన చైర్మన్ మోహన్రావు దీనిపై విచారణకు ఆదేశించారు. కారు డ్రైవర్, ఇంజన్ డ్రైవర్, అందులోని సిబ్బందిపై చర్యలు చేపట్టినట్టు తెలిసింది. చైర్మన్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేస్తున్నారు. ఈలోగా ఈ ఘటన జరగడంపై అధికార వర్గాలు ఆందోళనకు గురయ్యాయి.