పాలిటెక్నిక్ ప్రవేశాలు ఎన్నడో...
ABN , First Publish Date - 2023-07-16T01:17:23+05:30 IST
పాలిటెక్నిక్ ప్రవేశాలు ఆలస్యం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
నెలన్నర క్రితమే ముగిసిన ధ్రువపత్రాల పరిశీలన
జూన్ ఐదో తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది కొత్తగా మంజూరైన కళాశాలలకు సంబంధించి జీవో విడుదల కాకపోవడంతో వెబ్సైట్లో కనిపించని పేర్లు
ఆయా కళాశాలల యాజమాన్యాల అభ్యంతరంతో సీట్ల భర్తీ ప్రక్రియకు బ్రేక్
పట్టించుకోని ప్రభుత్వం
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన
విశాఖపట్నం, జూలై 15 (ఆంధ్రజ్యోతి):
పాలిటెక్నిక్ ప్రవేశాలు ఆలస్యం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ధ్రువపత్రాల పరిశీలన నెలన్నర క్రితమే ముగిసింది. జూన్ ఐదో తేదీ నుంచి కళాశాలల ఎంపికకు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చునని ప్రకటించిన ప్రభుత్వం, అదే నెల 15వ తేదీ నుంచి తరగతులు నిర్వహిస్తామని వెల్లడించింది. అయితే షెడ్యూల్ మధ్యలో నిలిచిపోయింది. కౌన్సెలింగ్ ప్రక్రియపై సాంకేతిక విద్యా శాఖ కమిషనరేట్లో హెల్ప్ లైన్కు ఫోన్ చేస్తే ఎవరూ ఆన్సర్ చేయడం లేదు.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలీసెట్-2023కు 1.6 లక్షల మంది దరఖాస్తు చేయగా 1.4 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 1.24 లక్షల మంది అర్హత సాధించారు. పరీక్ష ఫలితాలు మే నెలలో విడుదల చేయగా అదే నెల 29న కౌన్సెలింగ్కు షెడ్యూల్ ప్రకటించారు. దీని ప్రకారం మే 29వ తేదీ నుంచి జూన్ మూడో తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టి ఐదో తేదీ నుంచి కళాశాలల ఎంపికకు ఆప్షన్స్ ఇచ్చుకోవాలని సూచించారు. జూన్ 15వ తేదీ నుంచి తరగతులు నిర్వహిస్తామని షెడ్యూల్లో పొందుపరిచారు. అయితే కొత్తగా మంజూరైన 13 ప్రైవేటు కళాశాలలకు సంబంధించి ప్రభుత్వం జీవో ఇవ్వకపోవడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పరిధిలో మూడు, ప్రైవేటు పరిధిలో 13 కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. కొత్తగా పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభించాలంటే అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి తప్పనిసరి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఏఐసీటీఈ నుంచి మే నెలలో అనుమతి వచ్చింది. ఈ మేరకు రాష్ట్రం జీవో జారీచేయాలి. అప్పుడే సాంకేతిక విద్యా శాఖ ఆయా కళాశాలల పేర్లు వెబ్సైట్లో పొందుపరుచుతుంది. అయితే జూన్ నెల ఐదో తేదీ నాటికి కొత్త కళాశాలల మంజూరుపై జీవో విడుదల కాలేదు. ముందు ప్రకటించిన షెడ్యూల్ (జూన్ ఐదో తేదీ) ప్రకారం కళాశాలల ఎంపిక మొదలైతే ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్త కళాశాలల్లో సీట్లు భర్తీ కావని సంబంఽధిత యాజమాన్యాలు...ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాయి. దీంతో ఆప్షన్స్ ప్రక్రియ ముందుకువెళ్లలేదు. సర్టిఫికెట్ల పరిశీలన తరువాత 45 రోజులపాటు కళాశాలల ఎంపికకు అవకాశం ఇవ్వకపోవడం ఇదే మొదటిసారని పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు ఒకరు తెలిపారు.
తల్లిదండ్రుల ఆందోళన
పదో తరగతి తరువాత విద్యార్థులకు ప్రధానంగా నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, త్రిఫుల్ ఐటీ, ఐటీఐ. ఇంటర్మీడియట్ తరగతులు గత నెల మూడో వారం నుంచి ప్రారంభించారు. ఐటీఐ తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయిపోయింది. రెండో విడతకు నోటిఫికేషన్ ఇచ్చారు. తాజాగా త్రిఫుల్ ఐటీ ప్రవేశాలు జరుగుతున్నాయి. పాలి టెక్నిక్ కళాశాలల్లో సీట్ల కోసం సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చిన పలువురు విద్యార్థులు త్రిఫుల్ ఐటీలో చేరుతున్నారు. ఇంకా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ జాప్యం కావడంతో కొందరు విద్యార్థులు ఆలస్యమైనా ఇంటర్మీడి యట్లో చేరి పోతున్నారు. పాలిటెక్నిక్ చదవాలని భావిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాత్రం ఇంకా తరగతులు ప్రారంభించక పోవడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయం అసలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. విశాఖలో పాలిటెక్నిక్ కళాశాల అధికారులను సంప్రతిస్తుంటే త్వరలో ఆదేశాలు వస్తాయని చెబుతున్నారు తప్ప సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం లేవని వ్యాఖ్యానించారు.
ఉమ్మడి జిల్లాలో 5,500 సీట్లు
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎనిమిది ప్రభుత్వ, 20 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో అన్ని బ్రాంచీలు కలిపి సుమారు 5,500 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది నిర్వహించిన పాలీసెట్లో ఉమ్మడి జిల్లా నుంచి 19,423 మంది అర్హత సాధించారు. వీరిలో విశాఖ జిల్లా నుంచి 10,516 మంది, అనకాపల్లి జిల్లాలో 7,493 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,414 మంది మంది ఉన్నారు. కాగా విశాఖపట్నంలో పాలిటెక్నిక్, కెమికల్ ఇంజనీరింగ్ కళాశాలల్లో నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు 4,073 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఎన్ని నెలలు ఎదురుచూడాలి
- పొలమరశెట్టి అనీల్ కుమార్, (విద్యార్థి తండ్రి)
మర్రిపాలెం
ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ఆశతో మా అబ్బాయిని డిప్లొమాలో చేర్పిద్దామనుకున్నాం. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది. సర్టిఫికెట్ల పరిశీలన మే 29న ముగిసినా... ఇప్పటివరకు కళాశాలల్లో ప్రవేశాలు కల్పించలేదు. దీనిపై సమాధానం కోసం ప్రయత్నిస్తే..ఫోన్లు తీయడం లేదు. పాలిటెక్నిక్ చదివించాలా..లేక మరోవిధంగా ముందుకు వెళ్లాలో తెలియకఅయోమయ స్థితిలో ఉన్నాం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సాంకేతిక విద్యామండలి దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలి.