వైసీపీ సేవలో పోలీస్‌

ABN , First Publish Date - 2023-05-02T01:26:51+05:30 IST

విశాఖపట్నంలో కొంతమంది అధికారులు...అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వైసీపీ సేవలో పోలీస్‌

అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్న వైనం

వారిపై ఫిర్యాదులు వచ్చినా కేసు నమోదుకు వెనకడుగు

తప్పనిసరైతే షార్ట్‌ కట్‌లో పేర్లు

విజయసాయిరెడ్డి పేరు వీఎస్‌ రెడ్డి అని, కేకేరాజు పేరు కేకేఆర్‌ అంటూ నమోదు

మరో ఉదంతంలో బాధితుడైన బాలుడిపైనే రివర్స్‌ కేసు

విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నంలో కొంతమంది అధికారులు...అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో చోటుచేసుకున్న రెండు ఉదంతాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. 2021 నవంబరులో జీవీఎంసీ 31వ వార్డుకు ఉప ఎన్నిక జరిగింది. ఆ సమయంలో నీలమ్మవేపచెట్టు సమీపంలోని ఒక పోలింగ్‌ బూత్‌లో వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారనే సమాచారం అందడంతో జనసేన నాయకురాలు దుర్గతోపాటు మరికొందరు కార్యకర్తలు అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు వై.విజయసాయిరెడ్డి, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు తనతో వాగ్వాదానికి దిగారని, ఆ పార్టీ కార్యకర్తలు కొంతమంది తనపై దాడి చేశారంటూ దుర్గ టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదులో తాత్సారం చేయడంతో కోర్టులో ప్రైవేటు కేసు ఫైలు చేశారు. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేయాలంటూ టూటౌన్‌ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితిలో గత నెల 21న కేసు నమోదుచేశారు. అయితే అందులో నిందితులుగా విజయసాయిరెడ్డి పూర్తి పేరుకు బదులు వీఎస్‌ రెడ్డి అని, కేకేరాజు పూర్తిపేరుకు బదులుగా కేకేఆర్‌ అని నమోదుచేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. వారి పేర్లు ప్రజలకు తెలియకుండా దాచిపెట్టాలనే ఉద్దేశంతోనే పోలీసులు అలా చేశారంటూ జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.

తాజాగా నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వుంటున్న ఇంటర్‌ విద్యార్థి ఒకరు ఇటీవల ఫలితాలు విడుదలైనప్పుడు ఫెయిల్‌ కావడంతో ఏడుస్తూ తన ఇంటి సమీపంలో రోడ్డుపై నిలిపివున్న పాడుబడిన కారులో కూర్చున్నాడు. కారు యజమాని అయిన వైసీపీ మహిళా నేత, ఆమె కుమారుడు కలిసి ఆ విద్యార్థిని చావబాదడంతోపాటు ఇంటికి తీసుకువెళ్లి దుస్తులు విప్పించారు. విద్యార్థి తల్లిదండ్రులు ఫోర్త్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవతలివాళ్లు అధికార పార్టీకి చెందినవారు కావడంతో కేసు నమోదులో పోలీసులు తాత్సారం చేస్తూ వచ్చారు. పత్రికల్లో వార్తలు రావడంతో తప్పనిసరి పరిస్థితిలో విద్యార్థిని గాయపరిచిన వైసీపీ మహిళా నేత, ఆమె కుమారుడిపై కేసు నమోదుచేశారు. అయితే వైసీపీ మహిళా నేత ఫిర్యాదు చేశారంటూ సదరు బాలుడిపై చోరీ కేసు నమోదుచేశారు. దీనిపై విద్యార్థి కుటుంబసభ్యులు స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. బాధితుడికి న్యాయం చేయాల్సిన పోలీసులు తిరిగి అతడిపై చోరీ కేసు నమోదుచేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-05-02T01:26:51+05:30 IST