రాజ్మా, వలిసెల విత్తనోత్పత్తికి ప్రణాళిక
ABN , First Publish Date - 2023-03-08T00:32:01+05:30 IST
జిల్లాలో రాజ్మా, వలిసెల పంటల్లో విత్తనోత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశామని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్చార్జి ఏడీఆర్ డాక్టర్ పి.సందీప్ నాయక్ తెలిపారు. మంగళవారం పరిశోధన స్థానంలో అభ్యుదయ రైతులతో విత్తనోత్పత్తిపై సమావేశం నిర్వహించారు.
ఇన్చార్జి ఏడీఆర్ డాక్టర్ సందీప్ నాయక్
చింతపల్లి, మార్చి 7: జిల్లాలో రాజ్మా, వలిసెల పంటల్లో విత్తనోత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశామని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్చార్జి ఏడీఆర్ డాక్టర్ పి.సందీప్ నాయక్ తెలిపారు. మంగళవారం పరిశోధన స్థానంలో అభ్యుదయ రైతులతో విత్తనోత్పత్తిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఏడీఆర్ మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో రాజ్మా, వలిసెల పంటలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే పండుతాయన్నారు. ఆదివాసీ రైతులు పండించే రాజ్మా, వలిసెలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. గిరిజన రైతులు ఈ పంటలను సాగు చేసుకోవడం వల్ల అధిక ఆదాయం పొందుతారని చెప్పారు. రైతుల వద్ద నాణ్యమైన విత్తనం లేకపోవడం వల్ల సాగుకు దూరమవుతున్నారన్నారు. పరిశోధన స్థానంలో రైతులకు నాణ్యమైన విత్తనం అందించాలనే లక్ష్యంతో చింతపల్లి రెడ్, వలిసెల్లో జేఎన్ఎస్ 28 విత్తనాలు అభివృద్ధి చేశామన్నారు. రైతులకు ఈ విత్తనం అధిక మొత్తంలో అందజేసేందుకు విత్తనోత్పత్తి చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ విత్తనోత్పత్తికి ముందుకొచ్చే రైతులకు చిరు సంచుల్లో పరిశోధన స్థానంలో అభివృద్ధి చేసిన విత్తనాలను పంపిణీ చేస్తామన్నారు. రైతులు పండించిన పంటను తిరిగి కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు విత్తనం నాటిన నాటి నుంచి పంట కోతకు వచ్చే వరకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామన్నారు. రైతులు ఉత్పత్తి చేసిన రాజ్మా, వలిసెల విత్తనం వచ్చే ఏడాదికి ఎక్కువ మంది రైతులకు పంపిణీ చేస్తామన్నారు. పరిశోధన స్థానం చేపడుతున్న విత్తనోత్పత్తికి ఆదివాసీ రైతులు సహకరించాలని, అలాగే సాగుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక సహచరులు టి.అరుణ్ కుమార్, పి.జెన్నీ పాల్గొన్నారు.