నూకాంబిక ఆలయం కిటకిట
ABN , First Publish Date - 2023-03-27T01:01:44+05:30 IST
నూకాంబిక అమ్మవారి ఆలయం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. తెల్లవారుజామున ఆరు గంటలకు అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు.
అనకాపల్లి టౌన్, మార్చి 26 : నూకాంబిక అమ్మవారి ఆలయం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. తెల్లవారుజామున ఆరు గంటలకు అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు అనకాపల్లి, విశాఖ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. సాధారణ దర్శనం క్యూ రోడ్డుపై వరకు వచ్చింది. క్యూలో ఉన్న భక్తులకు ఆలయ సహయ కమిషనర్ చంద్రశేఖర్ దగ్గరుండి మంచినీరు అందించారు. అలాగే చంటి పిల్లలతో వచ్చిన వారికి ప్రత్యేకంగా గది ఏర్పాటు చేసి, పాలు సరఫరా చేశారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. కొం దరు కుటుంబ సమేతంగా వచ్చి ఆలయ కాటేజిలో వంటలు చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టి సహఫంక్తి భోజనాలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఈవో ఆధ్వర్యంలో సిబ్బంది చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పట్టణ సీఐ దాడి మోహనరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ సీఐ శ్రీను ఆధ్వర్యంలో ఎస్ఐలు, సిబ్బంది బందోబస్తు చేపట్టారు.