‘పోషణ’ పంపిణీలో కొత్త చిక్కులు
ABN , First Publish Date - 2023-08-02T01:08:30+05:30 IST
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ల పంపిణీలో ఇబ్బందులు తప్పేలా లేవని అంగన్వాడీ కార్యకర్తలు అంటున్నారు. లబ్ధిదారుల ఫొటో యాప్లో అప్లోడ్ అయితేనే రేషన్ కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిబంధన విధించిందని, సెల్ సిగ్నల్స్ సరిగాలేని మారుమూల గ్రామాల్లో సరకులను ఎలా పంపిణీ చేయాలో అర్థం కావడంలేదని ఆందోళన చెందుతున్నారు.
బాలింతలు, గర్భిణులు, మూడేళ్లలోపు చిన్నారులకు ఇళ్ల వద్దనే రేషన్
అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఆదేశం
లబ్ధిదారుల ఫొటోను యాప్లో అప్లోడ్ చేసిన తరువాతే అందజేయాలని నిబంధన
సెల్ సిగ్నల్స్ లేని పలు మారుమూల గ్రామాలు
పౌష్టికాహార కిట్ల పంపిణీపై అంగన్వాడీల సిబ్బంది డైలమా
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ల పంపిణీలో ఇబ్బందులు తప్పేలా లేవని అంగన్వాడీ కార్యకర్తలు అంటున్నారు. లబ్ధిదారుల ఫొటో యాప్లో అప్లోడ్ అయితేనే రేషన్ కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిబంధన విధించిందని, సెల్ సిగ్నల్స్ సరిగాలేని మారుమూల గ్రామాల్లో సరకులను ఎలా పంపిణీ చేయాలో అర్థం కావడంలేదని ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో తొమ్మిది ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,908 అంగన్వాడీ కేంద్రాలు వున్నాయి. వీటి ద్వారా ఏడు నెలల నుంచి ఆరేళ్ల వరకు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని (భోజనం) అంగన్వాడీ కేంద్రాల వద్దే వండి పెట్టేవారు. కరోనా వైరస్ ప్రబలిన తరువాత చాలా కాలంపాటు భోజనాలు వండిపెట్టకుండా, ఆయా సరకులను లబ్ధిదారులకు అందజేశారు. కొవిడ్ ప్రభావం తగ్గిన తరువాత పాత పద్ధతిలో భోజనాలు వండి పెట్టడం పునఃప్రారంభించారు. అయితే అంగన్వాడీ కేంద్రాల్లో కింద కూర్చుని భోజనం చేయడం ఇబ్బందిగా వుండడంతో చాలా మంది గర్భిణులు, బాలింతలు రావడం మానేశారు. కొన్నిచోట్ల కనీసం సగం మంది కూడా రావడంలేదు. ఈ విషయం ఐసీడీఎస్ ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో పౌష్టికాహార సరకులను (కిట్లు) అంగన్వాడీ కార్యకర్తలు ఆయా లబ్ధిదారుల ఇళ్లకు తీసుకెళ్లి పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు సుమారు 46 వేల మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు వారు 23 వేల మంది, గర్భిణులు, బాలింతలు కలిపి 19 వేల మందికిపైగా వున్నారు. మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు మినహా మిగిలిన చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ప్రతి నెలా రెండుసార్లు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేస్తారు. మొదటి పక్షంలో మూడు కిలోల బియ్యం, కిలో కిందిపప్పు, అర లీటరు వంటనూనె, రెండు కిలోల రాగి పిండి, కిలో అటుకులు, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల ఎండు ఖర్జూరాలు, 13 కోడిగుడ్లు, రెండున్నర లీటర్ల పాలు అందజేస్తారు. రెండో పక్షంలో 12 కోడిగుడ్లు, రెండున్నర లీటర్ల పాలు పంపిణీ చేస్తారు.
కొత్త నిబంధనలతో సమస్యలు
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందజేసే పౌష్టికాహారాన్ని ‘టేక్ హోమ్ రేషన్’గా పిలుస్తున్నారు. ప్రతి వస్తువు ప్యాకింగ్పై ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ అని పెద్ద అక్షరాలతోపాటు సీఎం జగన్మోహన్రెడ్డి ఫొటోను ముద్రించారు. ఆయా సరకులను ఒక సంచిలో వేసి వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లు పేరుతో అందజేస్తారు. అయితే కిట్లను పంపిణీ చేసే ముందు అంగన్వాడీ కార్యకర్తలు తమ వద్ద వున్న మొబైల్ ఫోన్లతో ఆయా లబ్ధిదారుల ఫొటో తీసి ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ సాఫీగా జరిగితేనే కిట్ అందజేయాలి. దీనివల్ల సెల్ సిగ్నల్స్ సరిగా లేని మారుమూల గ్రామాల్లో ఇబ్బందులు తలెత్తుతాయని అంగన్వాడీ సిబ్బంది వాపోతున్నారు. జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలకు ఎయిర్టెల్/ఐడియా సిమ్లను మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఈ కంపెనీల సెల్ టవర్లు పట్టణాలు, మండల కేంద్రాలు, ప్రధాన రహదారుల పక్కన మాత్రమే వుండడంతో ఇతరచోట్ల సిగ్నల్స్ అందడంలేదు. మాడుగుల, రావికమతం, రోలుగుంట, చీడికాడ, దేవరాపల్లి, గొలుగొండ, నాతవరం, కోటవురట్ల మండలాల్లోని శివారు/ ఏజెన్సీకి ఆనుకుని వున్న గిరిజన గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువగా వుంది. ఇటువంటి చోట్ల పౌష్టికాహారం కిట్లను ఎలా పంపిణీ చేయాలో అర్థం కావడంలేదని సిబ్బంది వాపోతున్నారు. ఆఫ్లైన్లో సరకులు అందజేసి, సెల్ సిగ్నల్స్ అందుబాటులో వున్న ప్రాంతానికి వచ్చి ఆన్లైన్లో అప్లోడ్ చేసేలా వెసులుబాటు కల్పించాలని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు.