నాడు-నేడు నత్తనడక

ABN , First Publish Date - 2023-03-26T01:40:23+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల కోసం చేపట్టిన శాశ్వత భవనాల నిర్మాణం ముందుకుసాగడం లేదు.

నాడు-నేడు నత్తనడక

ఉమ్మడి జిల్లాలో 203 అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాల నిర్మాణానికి ఎనిమిది నెలల క్రితం గ్రీన్‌సిగ్నల్‌

తల్లులతో కూడిన కమిటీలకు నిర్మాణ బాధ్యతలు

ఇప్పటివరకూ 138చోట్ల పనులే ప్రారంభం కాలేదు

స్థల వివాదాలు, నిధుల కొరత కారణం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అంగన్‌వాడీ కేంద్రాల కోసం చేపట్టిన శాశ్వత భవనాల నిర్మాణం ముందుకుసాగడం లేదు. ‘నాడు-నేడు’ పథకంలో భాగంగా ప్రభుత్వం ఏడాదిన్నర కిందట జిల్లాల అధికారుల నుంచి ప్రతిపాదనలు తీసుకుని, ఎనిమిది నెలల కిందట భవనాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. ఒక్కో భవనాన్ని రూ.16 లక్షలతో నిర్మించాలని, ఈ బాధ్యతను ఆయా కేంద్రాల్లో చదివే చిన్నారుల తల్లులతో కూడిన కమిటీలకు అప్పగించాలని ఆదేశించింది. అయితే, నెలలు గడుస్తున్నా భవన నిర్మాణ పనులు ముందుకుసాగడం లేదు. అనేకచోట్ల అసలు పనులు ప్రారంభం కాలేదు. భూ వివాదాలు, స్థానికుల అభ్యంతరాలతో నిర్మాణ పనులను నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అయితే స్థల సమస్య లేనిచోట కూడా నిర్మాణాలు సాగడం లేదని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.

నాడు-నేడు పథకంలో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో తొలి దఫా 203 అంగన్‌వాడీ కేంద్రాలకు (విశాఖ జిల్లాలో 13, అనకాపల్లి జిల్లాలో 59, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 131) భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. అయితే స్థల సమస్యలు, నిధుల కొరతతో పాటు స్థానికంగా వున్న పలురకాల ఇబ్బందులతో నిర్మాణ పనులు ముందుకుసాగడం లేదని అధికారులు చెబుతున్నారు.

మార్కింగ్‌ లెవెల్‌లోనే...

ఉమ్మడి జిల్లాలో 203 కేంద్రాలకుగాను 138 చోట్ల భవన నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 95, అనకాపల్లి జిల్లాలో 40, విశాఖ జిల్లాలో మూడు కేంద్రాల భవన నిర్మాణ పనులు మార్కింగ్‌ దగ్గరే నిలిచిపోయాయి. నిధులు విడుదల కాకపోవడం, స్థానిక తల్లుల కమిటీలు పనులు చేసేందుకు ముందుకు రాకపోవడం వంటివి కారణాలుగా చెబుతున్నారు. ఇకపోతే, కొన్నిచోట్ల స్థల వివాదం వల్ల పనులు ముందుకుసాగడం లేదు. ఇటువంటివి అనకాపల్లి జిల్లాలో ఆరు, విశాఖ జిల్లాలో రెండు ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో 19చోట్ల, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆరుచోట్ల పునాదుల (బేస్‌మెంట్‌ లెవెల్‌) వరకూ పనులు జరిగి నిలిచిపోయాయి. విశాఖ జిల్లాలో ఏడుచోట్ల పిల్లర్ల వరకు పనులు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 80 అంగన్‌వాడీ కేంద్రాలకు పాఠశాల ప్రాంగణాల్లోనే భవనాలు నిర్మించాలనుకున్నారు. ఆయాచోట్ల స్థల సమస్య లేకపోయినప్పటికీ పనులు ముందుకుసాగడం లేదు.

ముందుకు రాకపోవడంతో సమస్య

ఒక్కో భవన నిర్మాణానికి రూ.16 లక్షలు కేటాయించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ భవన నిర్మాణ బాధ్యతలను తల్లుల కమిటీలకు అప్పగించాలని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా కమిటీలు నియమించారు. అయితే, పేరుకే కమిటీలు గానీ, స్థానిక అధికార పార్టీ నాయకులే నిర్మాణ బాధ్యత తీసుకున్నారు. కానీ బిల్లులు సకాలంలో విడుదల కావన్న ఉద్దేశంతో పనులు ప్రారంభించలేదు. దీంతో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో నాడు-నేడు పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.

Updated Date - 2023-03-26T01:40:23+05:30 IST